ఏం డిసైడ్ చేస్తారు?: అందరి చూపు మమతా-కేసీఆర్ భేటీ వైపే, విందు మెనూ ఇదే!
హైదరాబాద్/కోల్కతా: తెలంగాణ సీఎం కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' ప్రకటన తర్వాత.. ఆయన తదుపరి కదలికలను అటు మీడియా, ఇటు రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. అనూహ్యంగా జాతీయ పాలిటిక్స్ వైపు దృష్టి సారించిన గులాబీ బాస్.. ఇందుకోసం వ్యూహాలను, ప్రణాళికలను సిద్దం చేసే పనిలో చాలానే కసరత్తులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. ఈ భేటీపై జాతీయ మీడియా కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది.

మధ్యాహ్నాం 2గం. తర్వాత భేటీ:
సోమవారం ఉదయం 11గంటల తరువాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కోల్కతాకు వెళ్లనున్నారు. లంచ్ తర్వాత మధ్యాహ్నాం 2.30గం. సమయంలో ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. బెంగాల్ సెక్రటేరియట్ లోనే ఈ భేటీ జరగనుంది.

ఏర్పాట్లు పూర్తి..:
కేసీఆర్ కోల్కతా టూర్ నేపథ్యంలో సీఎంవో అధికారులు ముందుగానే అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కోల్కతా విమానశ్రయం నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్లేందుకు ఇప్పటికే కాన్వాయ్ సిద్దం చేసి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మమతతో భేటీ కోసం కేసీఆర్ వెంట ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

జాతీయ మీడియా ప్రత్యేక ఆసక్తి..:
'ఫెడరల్ ఫ్రంట్' దిశగా కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నవేళ.. మమతాతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్'కు మమతా ఇప్పటికే మద్దతు తెలపగా.. తాజా భేటీలో వీరిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న జాతీయ మీడియా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేసుకుంది. అలాగే పలు తెలుగు మీడియా సంస్థలు కూడా ఇప్పటికే కోల్కతా చేరుకుని, సెక్రటేరియట్ ముందు ఓబీ వ్యాన్లను సిద్దం చేసుకున్నాయి.

ఏం డిసైడ్ చేస్తారు?:
'థర్డ్ ఫ్రంట్' ప్రతిపాదనపై దేశంలో ప్రస్తుతం వాడి వేడి చర్చ జరుగుతోంది. అసలు ఫ్రంట్ కు అవకాశమే లేదని కొందరు వాదిస్తుంటే.. కేసీఆర్ టైమింగ్ సరిగా లేదంటున్నవారు మరికొందరు. అదే సమయంలో అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా 'థర్డ్ ఫ్రంట్'కు పావులు కదుపుతున్నారన్న కథనాలు.
అన్నింటికిమించి కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ సాధ్యమా? అన్నది చాలామంది ప్రశ్న. మరోవైపు కేసీఆర్ మాత్రం సాధ్యమే అన్న ధీమాతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

కేసీఆర్ కోసం స్పెషల్ మెనూ..:
కేసీఆర్ రాకవేళ.. ఆయన కోసం మమతా బెనర్జీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసినట్టు సమాచారం. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను మమతా స్వయంగా పరిశీలించి, మెనూలో ఏయే ఐటెమ్స్ ఉండాలో సలహాలు సూచనలు ఇచ్చారట.
ఆమె ఆదేశాల మేరకు మిస్తీ పలావ్, కలాయిర్ దాల్, బేగున్ భాజా, ఆలూ పోస్తో, చనార్ దాల్నా, పరోటా, కాషా మాంగ్షోలను కేసీఆర్ కు వడ్డించబోతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు బెంగాల్ స్వీట్ ఐటెమ్స్ కూడా వడ్డించనున్నట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications