తెలంగాణలో ప్రతి ఇద్దరు వ్యక్తులకు ఓ వెహికల్: జనాభాలో సగానికి పైగా
రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే.. హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సహా వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న రోడ్డు ప్రమాదాలు, ప్రభుత్వం పాటించాల్సిన భద్రత ప్రమాణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టడానికి సుప్రీంకోర్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రోడ్డు భద్రతా చట్టాల అమలును పర్యవేక్షించడం, రాష్ట్ర విధానాలను సమీక్షించడం, రోడ్ల నిర్మాణం, ఇంజినీరింగ్, విధి విధానాల అమలు తీరు, అత్యవసర సమయంలో ఆయా శాఖల అధికారులు స్పందిస్తోన్న తీరుపై పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన విధి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కమిటీ పర్యటిస్తోంది.

ఈ సమీక్ష సమావేశంలో జస్టిస్ సప్రే మాట్లాడారు. దేశవ్యాప్తంగా రోజూ 500 మరణాలు, ప్రతి గంటకు 25 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ఆందోళనకర పరిణామమని అన్నారు. దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా నివారించదగినవే తప్ప దైవ సంకల్పం కాదని వ్యాఖ్యానించారు. మరణాలను తగ్గించడానికి అందరి సహకారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా.. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. తెలంగాణ రోడ్డు భద్రతకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ట్రాఫిక్ అమలులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వినియోగాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ వివరించారు. వాహనాల నమోదు, ప్రమాదాలు, మరణాలు, గాయాల గురించి రవాణా కమిషనర్ సురేంద్ర మోహన్ సంవత్సరాల వారీ గణాంకాలను అందించారు.
చిన్నతనం నుంచే అవగాహన పెంచడానికి పాఠశాల పాఠ్యాంశాల్లో రోడ్డు భద్రతా మాడ్యూల్స్ను చేర్చుతున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రతా కార్యక్రమాలను హెచ్ఎండిఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. బ్లాక్స్పాట్ తొలగింపు, లేన్ మార్కింగ్, సైనేజ్ ఏర్పాటు వంటి ఇంజినీరింగ్ పనుల గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వివరించారు.
దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో 10వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ వాడకం, అతివేగం వంటివి ప్రమాదాలకు ముఖ్య కారణాలని గుర్తించారు. ఇటువంటి నివారించదగిన ప్రమాదాల్లో యువ విద్యార్థులు, కుటుంబ పెద్దలు ఎక్కువగా ప్రభావితమవుతారని జస్టిస్ సప్రే తెలిపారు.
- తెలంగాణలో వాహనాల సంఖ్య 2014 నుంచి 2024 మధ్య 148 శాతం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.77 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు 9.3 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి.
- రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2024 సంవత్సరంలో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 7,949 మంది మరణించగా, 23,658 మంది గాయపడ్డారు.
- దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications