Sputnik V: హైదరాబాద్ చేరిన రెండో బ్యాచ్ వ్యాక్సిన్: శంషాబాద్లో ఫ్లైట్: ఏటా 850 మిలియన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సినేషన్ కొరతను అధిగమించే దిశగా మరో అడుగు ముందకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ రెండో బ్యాచ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్కు చేరుకుంది. రష్యా నుంచి బయలుదేరిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన కార్గో విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఉదయం ల్యాండయింది. ఇక ఈ వారమే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులో రాబోతోంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవాక్సిన్లకు ఇది స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ జత కట్టబోతోంది.
కొరత తీరుతుందిక..
భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ రెండింటేనే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఇందులోనూ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాటా అధికంగా ఉంటోంది.
మూడోదశ వ్యాక్సినేషన్ కింద 18 నుంచి 44 సంవత్సరాల వరకు వయస్సున్న వారికి టీకాలను వేయాల్సి ఉంది. టీకాల కొరత వల్ల ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు మూడోదశ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం స్టాక్ ఉన్నంత వరకే టీకాలు వేస్తున్నాయి.
రెండో బ్యాచ్ షిప్మెంట్..
ఈ పరిణామాల మధ్య స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ రెండో బ్యాచ్ భారత్కు చేరింది. రెండో బ్యాచ్ వ్యాక్సిన్తో రష్యా నుంచి బయలుదేరిన తొలి విమానం కొద్దిసేపటి కిందటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అక్కడి నుంచే ఈ వ్యాక్సిన్లను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కు తరలిస్తారు. ఇది రెండో షిప్మెంట్. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వీ వినియోగానికి డీసీజీఐ కిందటి నెల 13వ తేదీన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
91 శాతం ఎఫీషియన్సీ గల వ్యాక్సిన్..
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై 91 శాతం విజయవంతమైనట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రష్యన్ డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఆర్డీఎఫ్ఐ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. దీన్ని తయారు చేయడానికి అవసరమైన కాంట్రాక్ట్ను హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పొందింది.
దీనిపై గత ఏడాదే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం సైతం కుదిరింది. దీని రేటు ఎంత అనే విషయంపై నెలకొన్న సస్పెన్స్కు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తెరదించింది. వ్యాక్సిన్ డోసు రేటును నిర్ధారించింది. డోసు ఒక్కింటికి రూ.995.40 పైసలుగా నిర్ధారించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ.
Recommended Video
సంవత్సరానికి 850 మిలియన్ డోసులు..
ఈ నెల చివరివారం లేదా జూన్ మొదటి వారం నాటికి మరో 3,00,000 డోసులు అందుతాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఇదివరకే స్పష్టం చేసింది. వచ్చే జూన్ మొదటి వారం నాటికి అయిదు మిలియన్ డోసుల వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ షిప్మెంట్ కింద 1,50,000 డోసుల వ్యాక్సిన్ ఈ నెల 1వ తేదీన అందాయి. సంవత్సరానికి 850 మిలియన్ డోసుల మేర స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను భారత్కు సరఫరా చేస్తామని భారత్లోని రష్యన్ అంబాసిడర్ ఎన్ కుడషేవ్ తెలిపారు. త్వరలోనే సింగిల్ డోస్ వ్యాక్సిన్ను అందిస్తామని ప్రకటించారు.