రాజగోపాల్ రెడ్డి రాజీనామా క్షణాల్లో ఆమోదం : ఈటల తరహాలోనే - ఇక..బై పోల్ సమరం..!!
కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు తన లేఖ అందించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజగోపాల్ రెడ్డి తన లేఖను స్పీకర్ కు అందించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని రాజగోపాల్ స్పీకర్ ను కోరారు. స్పీకర్ వెంటనే ఆమోదించారు. రాజీనామా ప్రకటించిన తరువాత స్పీకర్ సమయం తీసుకొని రాజీనామా లేఖ ఇస్తానని గతంలోనే రాజగోపాల్ చెప్పారు. ఈ రోజున అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో రాజగోపాల్ నేరుగా స్పీకర్ ను కలిసారు. గతంలో ఈట రాజేందర్ తరహాలోనే రాజీనామా లేఖ ఇచ్చిన వెంటనే స్పీకర్ ఆమోద ముద్ర వేసారు.
క్షణాల్లోనే రాజగోపాల్ ఆమోదం
నాడు ఈటల రాజీనామా చేసిన క్షణాల్లోనే స్పీకర్ ఆమోదం - నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పుడు సైతం అదే జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయ అధికార వర్గాలు నిర్దారించాయి. దీంతో.. ఉప ఎన్నికలకు తెర లేవనుంది. ఈ రోజునే మునుగోడు సీటు ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వనుంది. దీని ద్వారా ఈ రోజు నుంచి ఆరు నెలల్లోగా మునుగోడు అసెంబ్లీకి బై పోల్ జరగాల్సి ఉంటుంది. నవంబర్ లో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో..వాటితో పాటుగా మునుగోడు బై పోల్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక తెలంగాణ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరుకు సెమీస్ గా భావిస్తున్నారు.
ఉప ఎన్నికలకు పార్టీలు సమాయత్తం
బీజేపీ లో ఈ నెల 21న చేరనున్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ - టీఆర్ఎస్ నుంచి అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. దీని పైన టీఆర్ఎస్ సర్వేలు చేయిస్తుండగా.. కాంగ్రెస్ సభ సైతం నిర్వహించింది. ఆ రెండు పార్టీల నుంచి అభ్యర్ధులు ఎవరనేది తేలాల్సి ఉంది. ఇక, ఈ నెల 21న బీజేపీలో అధికారికంగా రాజగోపాల్ చేరుతున్నా.. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తన మద్దతు దారులు..అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించారు. మరో ఏడాదిన్నార కాలంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.
అభ్యర్ధులు బరిలో నిలిచేదెవరు
దీంతో.. ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. గుజరాత్ కంటే ముందే ఎన్నికల సంఘం మునుగోడు పైన ఉప ఎన్నిక విషయంలో నిర్ణయం తీసుకున్నా...ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక విధంగా.. టీఆర్ఎస్ ఇప్పుడు వెంటనే రాజీనామా ఆమోదం ద్వారా తాము బై పోల్ యుద్దానికి సిద్దమనే సంకేతాలు ఇచ్చింది. ఇక.. ఎన్నికల సంఘం నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పుడు తెలంగాణలో మునుగోడు కేంద్రంగా రాజకీయం వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. కాసేపట్లో రాజగోపాల్ గవర్నర్ తోనూ సమావేశం కానున్నారు.