డిసెంబర్ 9.. తెలంగాణ స్పెషల్ డే
హైదరాబాద్ : డిసెంబర్ 9. తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కేంద్రం తలదించక తప్పని రోజు. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ బక్కపలచని నేత కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని కదిలించిన రోజు. మా తెలంగాణ మాగ్గావలే అంటూ నినదించిన గొంతులు ఢిల్లీకి సెగలా తగిలాయి. చివరకు తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో యూపీఏ సర్కార్ 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఇటు కేసీఆర్ దీక్ష.. అటు ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మంతనాలు. చివరకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ కేంద్రం దిగిరాక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న రోజంతా మూడుసార్లు సమావేశమైన కోర్ కమిటీ సాయంత్రానికి ఏమీ తేల్చలేదు. చివరగా నాలుగోసారి భేటీ అయి గంటలకొద్దీ చర్చించి ఆరోజు రాత్రి 11.30 గంటలకు తెలంగాణపై ప్రకటన చేశారు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం.
ఢిల్లీకి సెగ.. ఉద్యమం ఉధృతం
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు.. గులాబీ బాస్ నేతృత్వంలో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు కేసీఆర్. ఆయన దీక్షతో అంతవరకు తెలంగాణ ఏర్పాటుపై స్పందించని యూపీఏ సర్కార్ లో చలనం మొదలయింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు జరగరానిది జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని ఆలోచించారో ఏమోగానీ డిసెంబర్ 9 రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజం పోశారు. దీంతో బక్కపలచని ప్రాణమైనా ఢిల్లీకి సెగ తగిలించిన బలవంతుడిగా కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు తెలంగాణ ప్రజలు.
కేసీఆర్ దీక్ష.. కేంద్రంలో చలనం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందంటూ కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు ఉపక్రమించారు. దీంతో రోజురోజుకీ రాష్ట్ర సాధన ఉద్యమం మరింత జోరందుకుంది. దీక్ష మొదలైన మూడవరోజు అంటే డిసెంబర్ 1న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఉన్నా లేకున్నా.. ఉద్యమం నడవాలని ప్రకటన చేశారు. దీంతో ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. ఇక డిసెంబర్ 3న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం అందించడానికి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.
2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆరోగ్య స్థితిగతులపై పార్లమెంట్ లో పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వివిధ పక్షాల నేతలు సూచించారు. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత ముఖ్యమో.. కేసీఆర్ ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని ప్రతిపక్ష నేత అద్వానీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష 11వ రోజుకు చేరినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని అభిప్రాయపడ్డారు జేడీయూ నేత శరద్ యాదవ్. ఇలా రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతుగా నిలిచాయి.
యాధృచ్ఛికమా? సమయానుకూల నిర్ణయమా?
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. కేసీఆర్ ఆరోగ్యంపై దేశస్థాయిలో ఆయా రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొత్తానికి కేసీఆర్ దీక్ష అటు పార్లమెంటులో ఇటు బయట యూపీఏ సర్కార్ కు తలనొప్పిగా మారింది. దీంతో మెట్టు దిగక తప్పలేదు. చివరకు డిసెంబర్ 9న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. అయితే అదేరోజు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ జన్మదినం కావడం విశేషం. యూపీఏ పెద్దలు ఆ రోజు కావాలని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటన చేశారా? లేదంటే యాధృచ్ఛికంగా జరిగిందా అనేది గమనార్హం.