L Ramana: చంద్రబాబుకు బిగ్ షాక్: ఎన్టీఆర్ను చూసే టీడీపీలోకి: టీఆర్ఎస్కు ఒక ప్లస్
జగిత్యాల: ఊహించినట్టే- తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇన్నాళ్లూ ఏకైక పెద్దిదిక్కుగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్ రమణ.. షాకిచ్చారు. టీడీపీకి గుడ్బై చెప్పారు. ఆ పార్టీతో మూడు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తన అనుచరులు, అభిమానుల కోరిక మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ఆయన స్పష్టం చేయనప్పటికీ.. గులాబీ కండువాను కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారనేది తేలిపోయింది.
Recommended Video
ఎన్టీ రామారావును చూసే..
ఈ ఉదయం ఆయన జగిత్యాలలో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చూసే తాను 1983లో తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. ఆయనతో వేదికను పంచుకోవడం అదృష్టంగా భావించానని అన్నారు. ఎన్టీ రామారావును చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే పరిస్థితులు ఉండేవని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు.
విలువలతో కూడిన రాజకీయాలు..
విద్యావంతులు, బడుగులు, బలహీనుల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. అప్పట్లో యువ నాయకత్వాన్ని ఎన్టీ రామారావు ప్రోత్సహించారని అన్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో టీడీపీ నాయకుడిగా కంటే వ్యక్తిగతంగానే ఎల్ రమణ అంటే మంచి వ్యక్తి అనే పేరును తాను సంపాదించుకున్నానని చెప్పారు. తన పేరు చెప్పుకొన్న వారి గౌరవం ఇనుమడింపజేసేలా విలువలతో కూడిన రాజకీయాలు చేశానని రమణ అన్నారు.
ప్రజలతో మమేకం..
సాధారణ కుటుంబంలో జన్మించిన తాను రాజకీయంగా రాణించగలుగుతానని అనుకోలేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ బీఫామ్పై 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు. ఇలాంటి మహత్తరమైన అవకాశాన్ని టీడీపీ తనకు కల్పించిందని అన్నారు. దానికి అనుగుణంగా తాను శక్తికి మించి ప్రవర్తించానని చెప్పారు. చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో ప్రజలు పార్టీకి చేరువ అయ్యానని అన్నారు.
హైదరాబాద్కు రాక
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించానని, బలహీన వర్గాల గొంతుకను అత్యున్నత చట్టసభలో వినిపించానని అన్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, దానికి అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఎల్ రమణ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకొని వెళ్లానని గుర్తు చేశారు. ఏకపక్షంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని వివరణ ఇచ్చారు. కాగా- ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.