కెసిఆర్ చెప్పిందొకటి, చేస్తుందొకటి: రేవంత్, కార్మికుల వల్లే తెలంగాణ: కవిత
హైదరాబాద్: తెలంగాణ వస్తే పరిశ్రమలు వస్తాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారని, కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిశ్రమలను మూసివేయిస్తున్నారని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు మండిపడ్డారు. ఆయన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కార్మికులది కీలక పాత్ర: కవిత
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా ఇవాళ తెలంగాణ భవన్లో మే డే ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ పోరాటంలో కార్మికుల కృషి మరువలేనిదన్నారు.
కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు తమ హక్కులు సాధించుకున్నారని తెలిపారు. నాటి కాలంలో కార్మికులంటే లెక్కేలేకుండేనని గుర్తు చేశారు. పెట్టుబడిదారుల అహంకారానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికులు ఏకమయ్యారన్నారు.
అయినా కార్మికులకు ఎప్పటికప్పుడు కష్టాలు వస్తున్నాయని, సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అన్నారు. కార్మికుల పక్షాన నాయకుడుంటేనే వారి కష్టాలు తీరుతాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతిని సహించేదిలేదన్నారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
యాజమాన్యాల్లో అవినీతి అక్రమాలుంటే కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
కెసిఆర్ పైన నాయిని ప్రశంసలు
సీఎం కేసీఆర్ దేశం గర్వించదగ్గ నేత అని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతిరహిత పాలన కోసం ముఖ్యమంత్రి నడుం బిగించారన్నారు. మూతపడిన కాగజ్ నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలన్నారు.