పార్టీని వీడినవారితో పనిలేదు: టిఆర్ఎస్లో విలీనంపై టీటీడీపీతో బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వీడిని వారితో మనకు పనిలేదని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతేగాక, పార్టీలో ఎంతోమంది యువ నాయకులు ఉన్నారని, కార్యకర్తలకు వారు అండగా నిలవాలని కోరారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ టిడిపి ముఖ్యనేతలతో బుధవారం సాయంత్రం విజయవాడలోని తన నివాసంలో బాబు సమీక్ష జరిపారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, శాసనసభాపక్ష నేత రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, సండ్ర వెంకట వీరయ్య, ఎంపీలు మల్లారెడ్డి, గరికపాటి మోహన్రావు, నేతలు రావుల, మోత్కుపల్లి, పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: తెలంగాణలో టీడీపీ ఖాళీ: నేతల సెంటిమెంట్ ఇదే?
ఈ సందర్భంగా నేతలంతా పలు అంశాలను పార్టీ అధినేతకు వివరించారు. టిఆర్ఎస్ నేతలు పోలీసులతో, ఇతర మార్గాల్లో ఒత్తిళ్లు తెచ్చి టిడిపి నేతలను టిఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి టిఆర్ఎస్లో చేరడం వెనక కూడా ఇలాంటి ఒత్తిళ్లే పనిచేశాయన్నారు. వీటిని తట్టుకుని ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు వివరించారు.
తెలంగాణలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై పోరాడి ప్రజలకు అండగా నిలుస్తామని రమణ చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీకి తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పటిష్ఠమైన కార్యకర్తలు ఉన్నారని, వారికి ధైర్యం చెప్పి అండగా నిలవాలని నేతలకు సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, అప్పటిదాకా ప్రజల తరపున పోరాడితే విజయం మనదేనని చెప్పారు. టిఆర్ఎస్ ఒత్తిళ్లను తట్టుకుని పోరాడేందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని సూచించారు. వారానికి రెండుసార్లు హైదరాబాద్లో తమకు అందుబాటులో ఉండాలని నేతలు కోరగా వీలు చిక్కినప్పుడల్లా వస్తానన్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడే ఉంటూ అందరితో మాట్లాడతానని చెప్పారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలవారంతా పార్టీకి అండగా ఉన్నారన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండడానికి టిడిపి హయాంలో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి పనులే కారణమని ప్రజలకు చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టిడిపిను వదిలివెళ్లిన నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేసి పార్టీ పదవులన్నీ భర్తీ చేయాలని చెప్పారు.
టిడిపి శాసనసభా పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలంటూ ఎర్రబెల్లి స్పీకర్కు రాసిన లేఖ చెల్లదని రావుల వివరించారు. 2014లో టిఆర్ఎస్లో చేరిన తలసానిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పలుమార్లు విన్నవించిన ఎర్రబెల్లి అదే తలసానితో కలిపి ఏకంగా టిడిపి శాసనసభా పక్షాన్నే టిఆర్ఎస్లో విలీనం చేయాలని 2016లో సభాపతిని కోరడం న్యాయపరంగా చెల్లదని తెలిపారు.