తెలంగాణ వ్యాప్తంగా రేపట్నుంచి ఫీవర్ సర్వే: కరోనా కిట్లు అందజేస్తామంటూ హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలకు ఉపక్రమించింది. రేపట్నుంచి(జనవరి 21) నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో గురువారం ఆర్కే భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలను ఉన్న వారికి కరోనా కిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఫీవర్ సర్వే సెకండ్ వేవ్లో మంచి ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేగాక, ఈ ఫీవర్ సర్వే నీతి ఆయోగ్ వారి ప్రశంస అందుకుందని చెప్పారు హరీష్ రావు. అయితే ప్రస్తుతం కొంతమంది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేసుకోవడం లేదు. కనుక ఇక నుంచి అన్ని విభాగాల అధికారుల తో ఫీవర్ సర్వే చేయిన్చానున్నామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు.
కరోనా వ్యాధి లక్షణాలుంటే హోంఐసోలేషన్ కిట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్లను రెడీ చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే హోంఐసోలేషన్ కిట్ ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వాక్సినేషన్ లో ముందుందని తెలిపారు. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేయగా.. రెండో డోస్ 77శాతం పూర్తి అయిందన్నారు. ఇక బూస్టర్ డోస్ వేగవంతం చేయాలని అధికారులను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ని బస్తీ దవాఖానాల్లో కూడా హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఇక నుంచి ఆదివారం కూడా బస్తి దవాఖానాలు పని చేస్తాయన్నారు.
Recommended Video
హోమ్ ఐసోలేషన్ కిట్, టెస్టింగ్ కిట్లు: ప్రజలకు హరీశ్ రావు సూచనలు
ఐసీఎంఆర్ సూచన ప్రకారం టెస్టింగ్ కంటే ట్రీట్మెంట్ పైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ ఫివర్ సర్వే లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచిస్తున్నాని తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న మేడారంపై కూడా దృష్టి పెట్టామని.. అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ కిట్, టెస్టింగ్ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు సహా గ్రామస్థాయి వరకు పంపించామన్నారు. రాష్ట్రంలోని 27వేల పడకలూ ఆక్సిజన్ బెడ్లుగా మార్చినట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ సూచనలను ప్రజలు పాటించాలని, లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్తే హోంఐసోలేషన్ కిట్లను అందిస్తారని మంత్రి హరీశ్ రావు సూచించారు.