బిల్లు కట్టలేక ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య: ఎవరిదీ పాపం?
హైదరాబాద్/భూపాలపల్లి: ప్రైవేట్ ఆస్పత్రి బిల్లు చెల్లించలేక ఓ వ్యక్తి చికిత్స పొందిన ఆస్పత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2006లో చెల్పూరులో కేటీపీపీ నిర్మాణంతో భూపాలపల్లి మండలం మహబూబ్పల్లికి చెందిన మర్రి బాపు(46) తన రెండెకరాల భూమిని కోల్పోయారు. దీంతో అప్పట్లో ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని జెన్కో యాజమాన్యం చెప్పడంతో దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేగొండ మండలం పొనగల్లుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు.
సమయం దొరికినప్పుడల్లా కేటీపీపీ అధికారులను కలిసి తన కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారు మర్రి బాపు. అధికారుల వైఖరితో విసిగిపోయిన బాపు మార్చి 30,31 తేదీల్లో కేటీపీపీ వద్దకు వెళ్లి రెండు రోజులు అక్కడేవున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఏప్రిల్ 1న కేటీపీపీ గేటు వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే భూపాలపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన కోలుకున్నారు.
ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లు రూ. 60 వేలు చెల్లించాలని ఆస్పత్రి నిర్వాహకులు కేటీపీపీ సిబ్బందిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. బిల్లు చెల్లించాలని బాపు కుటుంబసభ్యులపై ఒడిత్తి చేసింది ఆస్పత్రి యాజమాన్యం. బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో.. బాపు కుటుంబసభ్యులు డబ్బుల కోసం బయటకు వెళ్లారు.
మూడు రోజులైనా తిరిగి ఎవరూ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన బాపు గురువారం ఆస్పత్రివార్డులోనే సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాపు ఆత్మహత్యతో ఆస్పత్రి ముందు వివిద రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబసభ్యులకు కేటీపీపీ రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అధికారులు 2006లో 750 మంది రైతుల నుంచి 900 ఎకరాలు సేకరించారు. నష్టపరిహారంగా ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన రైతుల పిల్లలు మైనర్లు లేదా అప్పటికి అర్హులు కాకపోవడంతో 550 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిలో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతున్నారు.