అన్న రికార్డును తిరగ రాసేలా షర్మిల ప్లాన్ -పీకే వ్యూహం మేరకే : ఈ నెల 18 నుంచి పాదయాత్ర - పార్టీలో చేరికలు..!!
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయంగా ప్రవేశించిన వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే, కొత్తగా పార్టీలోకి నేతలు ఎవరూ వచ్చి చేరలేదు. ఇరత పార్టీల నుంచి వలసలు తనకు అవసరం లేదని..ప్రజల్లో నుంచే కొత్త నేతలు వస్తారంటూ షర్మిల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఉద్యోగ కల్పన పైనే ఇప్పటి వరకు షర్మిల రాజకీయ పోరాటం చేస్తూ వచ్చారు. తన అన్నతో విభేదించి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ కోసం తన అన్నతో అయినా కోట్లాడుతానని చెప్పుకొచ్చారు.

యువతను ఆకట్టుకోవటమే లక్ష్యంగా
ప్రతీ మంగళవారం దీక్షలు కొనసాగిస్తున్నారు. షర్మిలతో ఉంటారని భావించిన కొంత మంది నేతలు సైతం పార్టీ వీడారు. ఇక, ఈ సమయంలో షర్మిల పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించారు. తెలంగాణ రాజకీయాలతో తనకు ఏం సంబంధం అనే ప్రశ్నకు సుదీర్ఘ కాలం షర్మిల సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో పార్టీ విస్తరణ..మద్దతు పైన పూర్తిగా వైఎస్సార్ అభిమానుల మీదే షర్మిల ఆధారపడ్డారు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మద్దతు తీసుకుంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ టీం మద్దతుతో
ఆయన టీం వ్యూహాల మేరకే ఇప్పుడు పాదయాత్రలో షర్మిల కొత్త అడుగులు వేయనున్నారు. షర్మిల పాదయాత్రలో పీకే టీం సభ్యులు సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. షర్మిల తన పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసారు. తెలుగు రాజకీయాల్లో తొలుత పాదయాత్ర చేసిన వైఎస్సార్ తరహాలోనే షర్మిల సైతం చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. వైఎస్సార్ మండు ఎండాకాలంలో 1,475 కిలో మీటర్ల మేర సాగింది. అధికారం తెచ్చి పెట్టింది. ఇక, 2012 అక్టోబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. 2013 ఏప్రిల్ వరకు మొత్తంగా 2,808 కిలో మీటర్లు ఆయన పాదయాత్ర చేసారు.

నాడు అన్న కోసం ఇదే రోజున పాదయాత్ర
ఇక, తన అన్న జైళ్లో ఉన్న సమయంలో షర్మిల 2012 అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర 2013 ఆగస్టు 4వ తేదీ వరకు సాగింది. మొత్తం 14 జిల్లాల్లో 3 వేల కిలో మీటర్ల యాత్ర సాగించారు. ఇక, వైసీపీ అధినేతగా జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర 341 రోజుల పాటు మొత్తంగా 3,648 కిలో మీటర్ల మేర సాగింది. దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో జగన్ మమేక మయ్యారు. ఈ యాత్ర సమయంలో పీకే టీం పూర్తిగా అనుసరించింది. 2019 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి సీఎం అయ్యారు.

అన్ని రికార్డును తిరగరాసి.. కొత్తగా
ఇక, ఇప్పుడు షర్మిల తన అన్న రికార్డును తిరగరాసి కొత్త చరిత్ర కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈ నెల 20వ తేదీన ఉదయం చేవెళ్లలో షర్మిల భారీ భహిరంగ సభ జరగనుంది. అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నాడు జగన్ పాదయాత్రలో ఏ రకంగా ప్రజలతో మమేక్ అయ్యారో..ఇప్పుడు షర్మిల సైతం యువత లక్ష్యంగా యాత్ర చేయనున్నారు.

పాదయాత్ర పైనే షర్మిల రాజకీయ భవిష్యత్
ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్తో షర్మిల పాదయాత్ర జరగనుంది. వైఎస్ సంక్షేమ పాలన ఎజెండాగా పాదయాత్ర సాగుతుంది. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతంపై సమావేశాలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్రలో 9 భారీ భహిరంగ సభలు షర్మిల నిర్వహిస్తారు. దీని ద్వారా తెలంగాణలో కొత్త నాయకత్వానికి పార్టీలో అవకాశం ఇవ్వటంతో పాటుగా..ప్రజలు తనకు అవకాశం ఇచ్చేలా తన పాదయాత్ర ఉంటుందని షర్మిల చెబుతున్నారు.












Click it and Unblock the Notifications