దాడుల సూత్రధారి కేసీఆరే: ఆత్మకూరులో టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ, ఉద్రిక్తత, బండి సంజయ్పై కేసు
నల్గొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని.. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు ఎస్పీ రంగనాథ్. బండి సంజయ్ తోపాటు పలువురు బీజేపీ నాయకులపైనా కేసు నమోదు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా టీఆర్ఎస్, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆత్మకూరులో ఉద్రిక్తత
కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన మరోసారి ఉద్రిక్తంగా మారిది. టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం కూడా బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆత్మకూర్(ఎస్) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బండి సంజయ్పై కేసు నమోదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఘర్షణలో పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. బండి సంజయ్ పర్యటన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారన్న కారణంతో కేసులు పెట్టినట్లు ఎస్పీ రంగనాధ్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అనుమతి తీసుకోకుండా పర్యటించడం సరికాదన్నారు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపథ్యంలోనే బండి సంజయ్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై, టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

లాఠీ ఛార్జీ చేసిన పోలీసులు
బండి సంజయ్ ఐకెపి కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో జరిగిన ఘర్షణల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం చివరి నిమిషంలో లేఖ ఇచ్చారన్నారు.

బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్లు, గుడ్లతో దాడులు
నల్గొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకెపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కాగా, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

దాడుల సూత్రధారి కేసీఆరే: బండి సంజయ్ ఫైర్
రాష్ట్రంలో బిజెపి నాయకులు, కార్యకర్తలపై దాడులకు కేసీఆరే సూత్రధారి. సీఎం ఆదేశాలతోనే టీఆర్ఎస్ గూండాలు, పోలీసులు దాడులకు కుట్ర చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) గ్రామంలో ఓవైపు టీఆర్ఎస్ గూండాలను దాడులకు ప్రేరేపిస్తూనే,... .మరోవైపు ఏకపక్షంగా బిజెపి నాయకులపై, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు, కర్రలతో విరుచుకుపడటంతో గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన రక్షకులే రాజకీయ పావులుగా మారి రాజ్యాంగానికి తూట్లు పొడవడం హేయమైన చర్య అని బండి సంజయ్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో రైతులు దినదినగండంగా గడుపుతున్నారు. ఈ దుస్థితికి కారణమైన కేసీఆర్ ఇకనైనా తీరు మార్చుకోవాలి. రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రాష్ట్ర ప్రభుత్వం సేకరించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది.రైతుల సమస్యలు తెలుసుకుని, భరోసా కల్పించేందుకు సూర్యాపేట జిల్లా లక్ష్మీనాయక్ తండాలోని కళ్లాలను సందర్శించిన సమయంలో వర్షం ప్రారంభంకావడంతో ధాన్యం తడవకుండా రైతులతో కలిసి టార్పాలిన్ కప్పామని బండి సంజయ్ తెలిపారు.












Click it and Unblock the Notifications