పదో తరగతి విద్యార్థుల దుందుడుకు: కారుతో టెక్కీ దంపతులను ఢీకొట్టారు
హైదరాబాద్లో చిన్నారి రమ్య ఉదంతాన్ని, పెద్ద అంబర్పేట్లో తల్లీ కూతుళ్ల ఘటనను మరిచిపోక ముందే హైదరాబాద్లో మరో ఘటన జరిగింది. టెక్కీ దంపతుల ద్విచక్రవాహనాన్ని పదో తరగతి విద్యార్థులు కారుతో ఢీకొట్టారు.
హైదరాబాద్: హైదరాబాదులోని పంజగుట్టలో రమ్య ఘటనను, నగర సమీపంలోని పెద్దఅంబర్పేటలో తల్లీకూతుళ్లు శ్రీదేవి, సంజన ఘటనలను మరిచిపోక ముందే హైదరాబాదులోని కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో ఆదివారం మరో దారుణమైన ఘటన జరిగింది.
పదోతరగతి చదువుతున్న విద్యార్థులు స్కార్పియో నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటన కూకట్పల్లి, ప్రగతినగర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ మైనర్ విద్యార్థుల దుందుడుకు చర్యకు ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా.
కెపిహెచ్బి పోలీస్స్టేషన్ పరిధిలోని బాచుపల్లి మండలం, ప్రగతినగర్, నిజాంపేటకు చెందిన విద్యార్థులు మిథులానగర్లో పదోతరగతి చదువుతున్న ఫణీంద్రతోపాటు స్నేహితులు సాయి మైకేల్, సాయి తేజ, వౌళి, రాము కలసి ఏపి 29 ఎటి 2799 నంబరు గల స్కార్పియో వాహనం పై అతివేగంగా దూసుకువెళ్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా, రావుల పాలెంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నాగేందర్, దేవి దంపతులు ప్రగతినగర్లో నివాసం ఉంటున్నారు. ఓ ఇంటి కోసం టిఎస్ 05 ఇఇ 6294 నంబరు గల ద్విచక్ర వాహనంపై వెతుకుతున్నారు. ఆ సమయంలో మిథులానగర్ మెయిన్ రోడ్డుకు వచ్చిన వారిని విద్యార్థులు స్కార్పియో వాహనంతో దూసుకువచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో నాగేందర్ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు.
దేవి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదానికి కారణమైన విద్యార్థులంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కెపిహెచ్బి పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.