కేంద్రం కళ్ళు లేని కబోది.! రైతులంటే బీజేపీకి గిట్టదన్న మంత్రి సత్యవతి రాథోడ్.!
హైదరాబాద్ : రైతుల సంక్షేమం పట్టని ప్రభుత్వం కేంద్రంలో ఉండడం రైతు దురదృష్టమని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. వచ్చే యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ విజ్ఞప్తిని అర్దం చేసుకుని సహకరించాలని రైతులను వేడుకున్నారు. రైతుల కష్టానికి తగిన ఫలితం ఉంటుందని ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు సత్యవతి రాథోడ్.
కేంద్రం రైతు వ్యతిరేకి.. మోదీకి రైతుల శాపం తగులుతుందన్న మంత్రి సత్యవతి
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రైతుల మీద ఉన్న ప్రేమ మరెవరికీ లేదన్నారు మంత్రి సత్యవతి. దురదృష్ట వశాత్తూ రైతు చనిపోతే బీమా ఇస్తున్నారని, విత్తనాలు అందుబాటులో ఉంచారని, ప్రభుత్వం చెప్పింది పాటించడం వల్ల మరింత లాభాలబాట పడతారని వివరించారు. రాష్ట్ర రైతాంగం అభివృద్ధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, రైతాంగా పెద్ద మనసుతో ప్రభుత్వం సూచిస్తున్న సలహాలు పాటించాలని, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించేందుకు అనేకం మాట్లాడతాయని, వారి మాటలను పట్టించుకోవద్దని హితవుపలికారు.
కల్లాల దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాలి.. ధైర్యం చెప్పిన రాథోడ్
అనంతరం జిల్లాలోని శనిగపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు. మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కల్లాల్లో ఉన్న రైతులు రాత్రి వేళల్లో తగు జాగ్రత్తులు తీసుకోవాలని, పంట కొనుగోలు జాప్యం జరుగుతోందని ఆవేదన చెందాల్సిన అవసరం లేదని సత్యవతి రాథోడ్ అన్నారు.
పేద గిరిజనులకు తప్పకుండా భూములు ఇస్తాం.. ఓపిక పట్టాలన్న మంత్రి
మహబూబాబాద్ జిల్లాలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంజూరు చేసిన మహబూబాబాద్ మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులును ఆదేశించారు. ఈ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం అందాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మెడికల్ కాలేజీ ఇచ్చారని మంత్రి గుర్తు చేసారు. జిల్లాలో పేదలు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ భూములు వారికి పంచాలన్న ఆశ వారిలో ఉందని, ఇక్కడ ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా 30 ఎకరాలు ఇవ్వాలంటే కొంతమంది కోర్టుకు వెళ్లారని, కోర్టుకు వెళ్ళిన ఇద్దరి,ముగ్గురి పేర్ల మీద భూమి అసైన్డ్ చేసినట్టు ఉందని, అసైన్డ్ చేసినట్టు తేలితే తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.
Recommended Video
మెడికల్ కాలేజీ జిల్లాకే తలమానికం.. కేసీఆర్ మంచి మనసున్న మారాజన్న మంత్రి సత్యవతి
ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దయతో జిల్లాలో 60 రకాల పరీక్షలు జరుగుతున్నాయని, మందులు అందుబాటులోకి వచ్చాయని, కోవిడ్ సమయంలో మహబూబాబాద్ ఆస్పత్రి చేసిన సేవలు అమోఘమని మంత్రి సత్యవతి కొనియాడారు. త్వరలో మెడికల్ కాలేజీ మెయిన్ బిల్డింగ్ టెండర్లు పిలుస్తున్నామని, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు.