Mayor Gadwal Vijayalakshmi: నగరం మరింత పచ్చదనంగా,పరిశుభ్రంగా.!మౌళిక సదుపాయాల కల్పనలో రాజీపడొద్దన్న మేయర్.!
హైదరాబాద్ : విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరం మరింత క్లీన్ సిటీగా మారబోతుంది. నగరంలో ఎక్కడ కూడా చెత్త కనిపించకూడదని, నగర పాలక సంస్ధ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేసారు. శానిటేషన్ సిబ్బంది సేవలు మరింత విస్త్రుతం చేసి మారుమూల స్లమ్స్ లో కూడా పరిశుబ్రతను పెంపొందించాలని సూచించారు. నగర పౌరులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాద్యత నగర పాలక సంస్ధపైన ఉందని, మరింత బాద్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మేయర్.
ఎలుచూసినా పచ్చదనం, పరిశుభ్రతే.. నగర శానిటేషన్ పై మేయర్ సమీక్ష
శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శానిటేషన్, వాక్సినేషన్, ఇంజనీరింగ్, ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ విభాగాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. శానిటేషన్, టాయిలెట్స్ నిర్వహణ పై సర్కిల్ సహాయ వైద్య అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని శానిటేషన్ వర్కర్స్ హాజరు, టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉందో లేవో తరుచూ పరిశీలించాలని మేయర్ ఆదేశించారు.
నగర పౌరులకు అసౌకర్యం కలిగించొద్దు.. నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాద్యత జీహెచ్ఎంసీదే నన్న మేయర్
అవెన్యూ ప్లాంటేషన్, థీమ్ పార్క్ ఇతర పనులలో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలని మేయర్ ఆదేశించారు. దోమల నివారణ చర్యల్లో బాగంగా ఫాగింగ్ చేయడం ప్రధానంగా మురికి వాడల్లో దృష్టి పెట్టాలని, వారం వారం నిర్దేశించిన ప్రదేశాలలో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ ప్రాంతాలను గుర్తించిన పెద్ద పెద్ద వ్యాపారస్తులపై దృష్టి సారించాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పూర్తయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు.
మౌళిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దు.. అధికారులకు కీలక ఆదేశాలు
అంతే కాకుండా నగర పాలక సంస్థకు రావాల్సిన పన్నులను నిర్దేశించిన సమయంలో వసూలు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. స్ట్రీట్ లైట్ విషయంలో పిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలన్నారు. శానిటేషన్, స్ట్రీట్ లైట్ అంశాల పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరి మాసం నుండి ప్రతి శుక్రవారం గ్రీన్ డే గా పాటిస్తామని చెప్పారు. శేరిలింగం పల్లి జోన్ లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, దాన్నిదృష్టిలో పెట్టుకొని 8 లింక్ రోడ్లను చేపట్టడం జరిగిందని అన్నారు. జాతీయ రహదారి, ముంబై హై వే నుండి వచ్చే ట్రాఫిక్ శేరీలింగం పల్లి నుండి మోహిదిపట్నం వెళ్లే ట్రాఫిక్ ను లింకు రోడ్ల ద్వారాను మళ్ళించే అవకాశం ఉందన్నారు. జోన్ లో చేపట్టిన 485 టాయిలెట్ ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు మేయర్.
రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్న మేయర్
100 శాతం వాక్సినేషన్ పూర్తవ్వాలని, ఇంటి ఇంటికి సర్వే నిర్వహించి వాక్సిన్ వేసుకోని జాబితా ప్రకారంగా వాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని, వీలుంటే మొబైల్ వాక్సిన్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు మేయర్ విజయలక్ష్మి. ఫస్ట్ డోస్ పూర్తయిన వారు రెండో డోస్ వేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జోనల్ కమిషనర్ ప్రియాంక అలా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ ఏ ఏంహెచ్ ఓ లు, శానిటేషన్, బయోవర్సిటి అధికారులు తదితరులు పాల్గొన్నారు.