New Year: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ..
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. నూతన సంవత్సరం మొదటి రోజు, సెలవు కూడా కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం క్యాలైన్లు కట్టారు.
అర్చనలు, అభిషేకాలు, పట్నాలు వేసి ఒడిబియ్యం పోసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి బోనాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మట్టి పాత్రలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇటు యాదాద్రి కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. న్యూ ఇయర్ రోజు సెలవు కావడంతో హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు వచ్చారు. స్వామివారి దర్శనానికి సమయం పడుతోంది.

ఇటు వేములవాడలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అటు కొండగట్టులో కూడా భక్తుల సందడి నెలకొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. 2024, జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం పురస్కరించుకుని తొలి రోజు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలొస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో రద్దీ కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అటు తిరుమల కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలంలో కూడూ భక్తులు పోటెత్తారు.












Click it and Unblock the Notifications