Rythu Bharosa: సాగులో ఉన్న భూములకే రైతు భరోసా..!
సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంత మేర సాగు చేశారో అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు రైతులు చెప్పిన విధంగానే పంట వివరాలు నమోదు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించడం లేదు. రైతులు ఇన్ని ఎకరాలని చెబితే దాన్ని వ్యవసాయ అధికారులు నమోదు చేస్తున్నారు. దీంతో పక్కా సమాచారం లేకుండా పోయిందని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేశారో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. రిమోట్సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని తేల్చాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు కంపెనీలతో మాట్లాడుతోంది. గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే నిర్వహించారు. మహబూబ్ నగర్, నారాయణపేట్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ 20 నుంచి 23 వరకు సర్వే చేశారు.

144 మండలాల్లోని 318 క్లస్టర్లలో సాగు భూముల లెక్క తేల్చారు. మిగతా జిల్లాల్లో కూడా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాటిలైట్ సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా, కచ్చితంగా నిర్వహించే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోకా సర్వే పూర్తి చేసి సంక్రాంతి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక రైతు రుణ మాఫీకి సంబంధించి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
తమకు రుణ మాఫీ ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నారు. అన్ని సరిగా ఉన్నా తమకు రుణ మాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications