Crime News: ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసింది అందుకే.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు వివాహేతర సంబంధం కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 19 ఖమ్మం జిల్లా వలభి సమీపంలో ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటనలో 24 గంటల్లోనే నిందితులకు సంబంధించి ఆధారాలు సంపాదించారు.
విష్ణువారియర్ సీరియస్
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ముదిగొండ మండలం వల్లభి సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఈ కేసును ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణువారియర్ సీరియస్ గా తీసుకున్నారు. నాలుగు బృందాలను నియమించి నిందితుల కోసం విచారణ చేపట్టారు.
ముగ్గురు
పోలీసులు మంగళవారం కీలక ఆధారాలు సేకరించారు. చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు జమాల్ సాహెబ్ను చంపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా.. ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఉన్నట్లు సమాచారం. ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫోన్ కాల్ డేటా
పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జమాల్ సాహెబ్ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా సేకరించి ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన వ్యక్తులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు నిందితులతో ఎక్కువసార్లు మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.