టీడీపీ గతే టీఆర్ఎస్ కు పడుతుంది .. టీడీపీపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
టిఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనంపై భట్టి విక్రమార్క చేసిన దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తీరును తప్పు పట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలు వినని స్పీకర్ 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు సిగ్గు ఉండాలి అంటూ ఆయన మండిపడ్డారు.అంతేకాదు టిడిపి పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి.
టీడీపీకి పట్టిన గతే పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 12 మందే మిగులుతారన్న రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గతంలో ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీకి మొన్న జరిగిన ఎన్నికల్లో అదే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మిగిలారని, ఏపీలో టీడీపీకి పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కు కూడా పట్టబోతుందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా నే, రాజ్యాంగం ప్రకారమే సీఎల్పీ విలీనం జరిగిందని పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి . కేటీఆర్ కు చట్టం తెలియకుంటే ఈ విషయం గురించి అడ్వకేట్ జనరల్ ని కేటిఆర్ సంప్రదించాలని ఆయన సూచించారు.
భారత రాజ్యాంగం పక్కన పెట్టి కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకువస్తున్నారని ఫైర్
అంతేకాదు 2016 లోని టీడీపీ విలీనం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తు చేశారు.భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసలు విలీనం స్పీకర్ పరిధిలోనిది కాదని పేర్కొన్న రేవంత్ రెడ్డి విలీనం చేసే అధికారం స్పీకర్ కు లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి లెక్కలు విడుదల చేసిన ఎమ్మెల్యేలు తిరిగి తామంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమని ఏ విధంగా విలీనం కోరుతారని ఆయన మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్లంతా వెధవలు అంటూ ఆయన తిట్టిపోశారు.
కేసీఆర్ దృష్టి కేవలం ఫిరాయింపులపైనే .. సీఎల్పీ విలీనంపై వివరణ ఇవ్వాలి
టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అభివృద్ధి పైన కాకుండా ఫిరాయింపు పైనే దృష్టి సారించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏ రాజ్యాంగం ప్రకారం సీఎల్పీ ని విలీనం చేశారో సమావేశం పెట్టి కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 45 శాతం మంది ఓటర్లు వోటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీటీసీ లను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించినంత మాత్రాన అదే గొప్ప విషయం అన్నట్లుగా ప్రచారం చేసుకోవడం గులాబీ పార్టీకే చెల్లుబాటు అవుతుందని ఆయన విమర్శించారు.