వచ్చే రోజుల్లో వైరస్ విజృంభించే అవకాశం.!మరింత జాగ్రత్తగా ఉండాలి.!ఆరోగ్య శాఖ డైరెక్టర్ హెచ్చరికలు.!
హైదరాబాద్: కరోనా పేషెంట్ల అంశంలో ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. వచ్చే మే నెలలో కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాని తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. ఎవరూ కూడా మాస్కులను నిర్లక్ష్యం చేయొద్దని, కరోనా లక్షణాలు కనిపించగానే తగు చికిత్స చేసుకోవాలని సూచించారు. కరోనా వాక్సీన్ ప్రతిఒక్కరికి అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోపు కరోనా పంజా విసిరే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్.
మరికొద్ది రోజుల్లో కరోనా ఉగ్రరూపం.. జాగ్రత్తగా ఉండాలన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ అన్నారు. కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్ )మీడియాతో కోవిడ్ పరిస్తితులను వివరించారు. కొవిడ్పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్ కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు శ్రీనివాస్.
లక్షణాలు ఉంటే టెస్టులు చేయించుకోండి.. నిర్లక్ష్యం వద్దన్న డీహెచ్..
లక్షణాలు ఉన్నవారికే కరోనా టెస్టులు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. విరేచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం లాంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారే టెస్టుకు రావాలన్నారు. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని, సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పడకలు అందుబాటులో ఉన్నాయని.. బాధితుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పడకల సంఖ్యను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
పడకలు పెంచాం.. కోవిడ్ పేషెంట్లు ఆందోళన చెందొద్దన్న హెల్త్ డైరెక్టర్..
ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కరోనా బాధితులకు 50 వేల పడకలు కేటాయించామని తెలిపారు. వైరస్ సోకిన 85 శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని.. అవసరమైతే తప్ప ఆస్పత్రులకు రావొద్దని డీహెచ్ ప్రజలకు సూచించారు. సీఎం చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షిస్తున్నారని తెలిపారు. అవసరం లేకుండానే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడింది. ఆక్సిజన్, ఔషధాలు, పడకల విషయంలో మెరుగైన స్థితిలో ఉన్నామని తెలిపారు శ్రీనివాస్. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.
Recommended Video
. టీకా వేసుకున్న వారు సేఫ్.. అపోహలు వద్దన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
అంతే కాకుండా కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. మే నెలాఖరు వరకు ప్రజలు సామాజిక బాధ్యతగా మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చామని, టీకా వేసుకున్నవారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదని, టీకా వేసుకున్న వారికి వైరస్ సోకినా ఆస్పత్రిలో చేరలేదని అన్నారు. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కొవిడ్ సోకలేదని, 18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందనిని డీహెచ్ శ్రీనివాస్ వివరించారు.