ఆ ఊరి పరిస్థితి ఎంత దారుణం అంటే .. సాక్షాత్తు సర్పంచే వలస పోయేంత
మా ఊరి సర్పంచ్ వలసపోయింది. అధికార పార్టీ మద్దతుతో హోరాహోరీగా సాగిన పంచాయతీ పోరులో విజయం సాధించిన ఆ ఊరి సర్పంచ్ ఉపాధి కోసం ఊరు విడిచి పోయింది. బతుకు తెరువు కోసం ముంబై బాట పట్టింది. నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండాలో సర్పంచ్ వలసపోవడం స్థానికంగా ఉన్న పరిస్థితిని ఆ ఊరి దయనీయమైన స్థితిగతులను తేటతెల్లం చేస్తుంది.

జీవనోపాధి కోసమే వలస బాట పట్టిన సర్పంచ్ , ఉప సర్పంచ్
ఎక్కడైనా సర్పంచ్ అంటే గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలి. గ్రామాన్ని ప్రగతిపధంలో ముందుకు నడిపించాలి. కానీ ఆ సర్పంచ్ గ్రామంలో తనకే ఉపాధి లేక ముంబై బాట పట్టింది. ఇక ఉపసర్పంచ్ పొట్టకూటి కోసం పాలమూరుకు వెళ్లి పని చేస్తుంది. సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు గ్రామాన్ని వీడి వెళ్లారు అన్న చర్చ స్థానికంగా అందరినీ నివ్వెర పరుస్తున్నా ఉన్న ఊరు వదిలి వెళ్లడానికి వారికి అక్కడ జీవనోపాధి లేకపోవడం ఓ కారణంగా తెలుస్తోంది.

ముంబై కి వలసపోయిన సర్పంచ్ సరోజా బాయి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎర్రగుంట తండా కొత్తగా గ్రామపంచాయతీ అయింది. సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వు కాగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మద్దతుతో సరోజ బాయి సర్పంచ్ గా ఎన్నికైంది. ఊళ్లో పనులు లేక బ్రతికే దారి లేక పదిహేను రోజుల క్రితం ముంబైకి వలసపోయింది సరోజా భాయి. పంటలు పండే అవకాశం లేక, కూలీ పనులు దొరకకపోవడంతో ఈ తండావాసులు వలస బాట పట్టారు.

ఎర్రగుంట తండాలో కరువు పరిస్థితులు .. ఆదుకోవాలని విజ్ఞప్తి
ఏకంగా సర్పంచ్ సైతం వలస వెళ్లారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగునీరు లేక, తాగునీరు లేక ఉపాధి అవకాశాలకు తావే లేక ఎర్రగుంట తండావాసులు పరమ దుర్భిక్షం అనుభవిస్తున్నారు. పాలకులు దృష్టి సారించి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడితే వలసపోయిన సర్పంచ్ తిరిగి ఊరికి చేరే అవకాశం ఉంటుంది అని ఎర్రగుంట తండావాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications