పారిపోతూ భవనంపై నుంచి పడి మరణించిన దొంగ
హైదరాబాద్: మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్కు ప్రయత్నించిన ఓ యువకుడు స్థానికులు వెంటాడడంతో పారిపోవడానికి ప్రయత్నించి ఓ భవనంపై నుంచి దూకి గాయపడ్డాడు. ఆ తర్వాత అతను మరణించాడు. ఈ సంఘటన హైదరాబాదులోని లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ప్రశాంత్నగర్ పిండిగిర్ని సమీపంలో నుంచి ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని గొలుసును తెంపడానికి ప్రయత్నించాడు.

అప్రమత్తమైన ఆమె కేకలు వేయడంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి పక్కన ఉన్న మరోభవనంపైకి దూకుతుండగా జారి కిందపడ్డాడు.
స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలకు గురైన అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.












Click it and Unblock the Notifications