వైసిపిలో నాయకుడే లేడు, 'కెటిఆర్తో విభేదాలు' సొల్లు: హరీష్ రావు
వరంగల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రా పార్టీలు అని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో విభేదాల ప్రచారం పైన కూడా స్పందించారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముమ్మాటికి దోషి అన్నారు. టిడిపి, వైసిపిలు ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలేనని చెప్పారు. జై తెలంగాణ అనే పార్టీలు వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు.
తెలంగాణ చంద్రబాబు, వైయస్, జగన్, విజయమ్మలనే ఇక్కడి వారు అడ్డుకున్నారని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడితే.. చంద్రబాబునైనా, జగన్ను అయినా అడ్డుకుంటారన్నారు. బిజెపి పత్తి కొనుగోళ్లతో రాజకీయం చేస్తోందన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు పోటీయే లేదని, ప్రతిపక్షాలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని,క నాయకుడు లేని, డైరెక్షన్ లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నాయకత్వంలో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉందని చెప్పారు.
మంత్రి కెటిఆర్తో విభేదాల ప్రచారంపై స్పందిస్తూ... ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ఇద్దరం కలిసి పని చేస్తున్నామని చెప్పారు. కావాలనే విపక్షాలు తమ పైన బురద జల్లుతున్నాయన్నారు.
కెసిఆర్ ఇప్పుడు బాగా పని చేస్తున్నారని, ఇలాంటప్పుడు భావి సీఎంలు ఎవరు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. కొందరు నోటి దురుసుతో, మీడియాలో వార్తల కోసం సొల్లు వాగుతున్నారని, వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్నారు.