గోమాంసం లేకుంటే సరే, రాజాసింగ్పై క్రమశిక్షణా సంఘం నిర్ణయం: బిజెపి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే బీఫ్ ఫెస్టివల్లో గోమాంసం లేకపోతే తమకు అభ్యంతరం ఉండదని బిజెపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ రామచందర్ రావు చెప్పారు. బుధవారం జరిగిన బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్పై క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
కిషన్ రెడ్డి తన జీవితాన్ని పార్టీకే అంకితం చేశారని, కిషన్ రెడ్డి నిర్ణయాలేవీ వ్యక్తిగతం కాదని ఆయన అన్నారు. కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని రాజాసింగ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ను కిషన్ రెడ్డి వ్యతిరేకించడం లేదని ఆయన తప్పు పట్టారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని రామచందర్ రావు చెప్పారు. స్థానిక ప్రతినిధుల కోటా కింద తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.