ఒంటరి మహిళలు, వాహనాలే టార్గెట్ (ఫొటోలు)
కరీంనగర్: పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను దొంగిలించడం, ఒంటరిగా వెళ్ళే మహిళలను లక్ష్యంగా చేసుకుని కంట్లో కారం చల్లి వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లే ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను మెట్పల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
కోరుట్ల మండలం అలమయ్యగుట్ట చింతల్వాడకు చెందిన చితారి శ్రీనివాస్ (24), కొండపల్లి పరుశురాములు అలియాస్ పప్పి (25), నూనే పరుశురాములు (25), నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్కు చెందిన కదమంచి శంకర్ (25), కదమంచి పాపయ్య అలియాస్ పప్పి (24) అనే ఐదుగురిని పోలీసులు పట్టుకుని, వీరి నుంచి రూ.6.27లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వి.శివకుమార్ ఆ వివరాలను అందించారు. ఈ ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలోని మల్లాపూర్, పెగడపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక చైన్స్నాచింగ్ కేసులో లభించిన చిన్న ఆధారంతో ఈ ముఠాపై నిఘా వేయగా, పక్కా సమాచారం మేరకు మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులో ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి 5లక్షల 25వేల 500 రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల విలువచేసే రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో దోపిడి, దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వేసవిలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆరు బయట నిద్రించే వారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, వేసవిలో ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారమందిస్తే ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చర్యలను ఉదృతం చేస్తామని చెప్పారు.

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని, జనసమర్ధ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లల్లో సంచరిస్తున్నామని తెలిపారు. షీ బృందాలతోపాటు విద్యార్థినిలు, మహిళల భద్రత కోసం జిల్లా పోలీస్శాఖ ‘ఎండిఫెన్స్' అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఈ అప్లికేషన్ను తీసుకువస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications