ప్రజలకు తెలియాలి: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్యెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. వీరు ముగ్గురూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్ చేశారని.., సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
Recommended Video
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని హైకోర్టు ధర్మసనానికి విజ్ఢప్తి చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. సస్పెన్షన్పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరిగా ఉందన్నారు. ఇదే తరహా ఘటనకు సంబంధించి గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వచ్చిందని రఘునందన్ రావు గుర్తు చేశారు.
కాగా, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేశారో రాత పూర్వకంగా ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరగా.. నాలుగు రోజులు సమయం అడిగినట్లు పేర్కొన్నారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పాలక పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్ గౌరవం పెరుగుతుందని ఈ సందర్భంగా రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
సోమవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు ప్రారంభం అయిన రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అధికార పార్టీ మంత్రి తీర్మానం పెట్టడం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.
కాగా, గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడంతో వారిని బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని అధికార పక్షం టీఆర్ఎస్ కోరడం, అందుకు స్పీకర్ కూడా ఓకే చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిది.












Click it and Unblock the Notifications