వాన్నా క్రై: హైద్రాబాద్ లో నిలిచిన మూడు ఐటీ కంపెనీల సేవలు
రాన్సమ్ వేర్ వాన్నా క్రై ప్రభావం రాజధాని నగరంలోని మూడు ఐటీ కంపెనీలపై పడింది. హ్యాకర్లు ఆ కంపెనీల కార్యకలాపాలను పూర్తిగా స్థంబింపజేశారు. ఆ కంపెనీలకు చెందిన సమాచారాన్ని నిర్వీర్యం చేశారు.
హైదరాబాద్: రాన్సమ్ వేర్ వాన్నా క్రై ప్రభావం రాజధాని నగరంలోని మూడు ఐటీ కంపెనీలపై పడింది. హ్యాకర్లు ఆ కంపెనీల కార్యకలాపాలను పూర్తిగా స్థంబింపజేశారు. ఆ కంపెనీలకు చెందిన సమాచారాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో మూడు కంపెనీల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయియ.
లక్షలు డిమాండ్ చేసిన హ్యాకర్లు... ఆ కంపెనీల నుండి సరైన స్పందన లభించకపోవడంతో ఆయా సంస్థలకు చెందిన పూర్తి సమాచారాన్ని డిలీట్ చేశారు. అనుబంధసంస్థలైన ఈ కంపెనీల ప్రతినిధి నగర సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైద్రాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లోని చెవ్రోన్ సాఫ్ట్ వేర్, ఓ ప్లెంటస్ గ్రీన్స్ కన్సల్టెన్సీస్, మోర్ వీసాస్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలున్నాయి. చెవ్రోస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఐటీ ఆధారిత ఉత్పత్తులు, సేవలను అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వీరికి క్లయింట్స్ ఉన్నారు.
ఓ ప్లెంటస్ గ్రీన్స్ కన్సెల్టెన్సీస్ విదేశాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సహకరిస్తోంది. మోర్ వీసాస్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ వీసాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తోంది. ఈ మూడు అనుబంధసంస్థలుగా పనిచేస్తూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఇంట్రానెట్ ను ఉపయోగిస్తున్నాయి.
వారం రోజుల క్రితం మోర్ వీసాస్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న సమయంలో కంప్యూటర్లు వాన్నా క్రై బారినపడ్డాయి. కంప్యూటర్లు లాక్ అయిపోవడంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అప్రమతమత్తమయ్యేలోపుగానే ఇంట్రానెట్ ద్వారా మిగతా రెండు సంస్థల్లోని కంప్యూటర్లు కూడ హ్యాకింగ్ గురయ్యాయి. హ్యకర్లు అడిగిన మొత్తం చెల్లించినా డేటాను ఇస్తారనే గ్యారంటీ లేకపోవడంతో నిర్వాహకులు రాన్సమ్ చెల్లించడానికి ఇష్టపడలేదు.
మూడు కంపెనీలకు సంబంధించిన డేటాను వెలికితీసేందుకు నిపుణులు ప్రైవేట్ కీను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మరో వైపు పెట్టిన గడువు ముగియడంతో హ్యాకర్లు డేటాను పూర్తిగా నాశనం చేశారు. ఆ డేటాను తిరిగిపొందేందుకు వీల్లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు ఆ కంపెనీల కంప్యూటర్లను ఎక్కడ నుండి హ్యాక్ చేశారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. మరో వైపు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోకి దక్షిణ రైల్వే కార్యాలయంలోని ఆరు కంప్యూటర్లు తాజాగా వాన్నా క్రై బారినపడ్డాయి.