అతి వేగం టెక్కీల ప్రాణాలు తీసింది: వ్యాన్ను ఢీకొట్టిన కారు
అతి వేగం ముగ్గురు టెక్కీల ప్రాణాలు తీసింది. టెక్కీలు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో దూసుకెళ్లి వ్యాన్ను వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: అతి వేగం ప్రాణాల మీదికి తెస్తోంది. హైదరాబాదులో అతి వేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎపి మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అతి వేగం వల్లనే కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ముగ్గురు టెక్కీలు కారును అతి వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం ఉదయం కారులో ప్రయాణిస్తున్న నలుగురు మిత్రుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకతను తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను ఎన్. రవితేజ, పి. సూర్యతేజ, టి రోహిత్లుగా గుర్తించారు. వారి మిత్రుడు కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.
వారు నలుగురు కూడా ఐఐటి ఖరగ్పూర్లో క్లాస్మేట్స్, పాత మిత్రులు. ఖమ్మంలోని పెళ్లికి వెళ్లడానికి వారు హుందాయ్ వెర్నా కారులో హైదరాబాదులోని గచ్చిబౌలి నుంచి బయలుదేరారు. అతి వేగంతో వెళ్తున్న కారు వెనక నుంచి డిసిఎం వ్యాన్ను ఢీకొట్టింది. కారు దాదాపుగా వ్యాన్ కిందికి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మరణించారు.
కారును సూర్యతేజ అతి వేగంతో నడుపుతున్నట్లు సమాచరాం. రవితేజ, సూర్యతేజ అక్కడిక్కకడే మరణించారు. రోహిత్ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోహిత్ అంకుల్ శ్రీనివాస రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.