మళ్లీ చేతులు కలుపుతున్న కేసీఆర్, వైఎస్ జగన్.. లెక్కలు తేల్చేందుకు సీఎంల భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లు నేడు భేటీ కానున్నారు.విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

నేడు కేసీఆర్ తో భేటీ కానున్న ఏపీ సీఎం జగన్ షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 9.30కి గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న ఇంటి నుండి బయలుదేరి 9.50కి గన్నవరం విమానాశ్రయానికి చేరతారు . 10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కి 10.40కి చేరతారు. ఆ తరువాత 11.40 వరకు లోటస్పాండ్లోని తన ఇంటికి వెళ్తారు. సీఎం కేసీఆర్ తో మాత్రం మధ్యాహ్నం భేటీ అవుతారు. నేడు జరగనున్న భేతీపై ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్న జగన్
నేడు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎం కేసీఆర్ ఇల్లు ప్రగతిభవన్కు వెళ్లి అక్కడ కేసీఆర్ తో చర్చలు జరుపుతారు. సీఎం జగన్ చర్చల అనంతరం రాత్రికి మళ్లీ లోటస్పాండ్ వచ్చి అక్కడే రాత్రికి బస చేస్తారు . 24న ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 11.40కి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు . సీఎం జగన్ తెలంగాణా రాష్ట్ర సందర్శనకు సంబంధించి , కేసీఆర్ తో భేటీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.ఇక ఇరు రాష్ట్రాల సీఎంల కీలక భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు.

విభజన సమస్యలు , నదీ నీటి సద్వినియోగం , నదుల అనుసంధానంపై ప్రధాన చర్చ
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో విభజన నాటి నుండి నేటివరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నారు .అంతే కాదు నదుల నీటి వినియోగం, నదుల అనుసంధానం , ఏపీకి రావలసిన కరెంట్ బకాయిలు , 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల విభజన, ఇతర అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. గోదావరీ, కృష్ణా నదుల అనుసంధానంపై , ముఖ్యంగా గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించే అంశంపై ప్రధాన చర్చ జరుగుతుందని సమాచారం.

వరద నీటిని కూడా కరువు ప్రాంతాల కోసం ఉపయోగపడేలా చెయ్యాలనే ఆలోచనలో ఇద్దరు సీఎం లు
వరద నీటిని అనవసరంగా సముద్రంలోకి పంపడం కన్నా వాటితో రాయలసీమలోనే కాకుండా తెలంగాణాలోనూ కరువు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు భావిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది . ఇక ఈ భేటీకి రెండు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా హాజరు అవుతున్నారు . ముఖమంత్రుల ఆలోచలన సాధ్యాసాధ్యాలను గురించి వారు ఈ భేటీలో తమ అభిప్రాయం చెప్పనున్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు .. కేంద్ర వైఖరిపై చేర్చించే అవకాశం
నేడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అంశాలపై గతంలో కూడా పలు దఫాలుగా చర్చ జరిగింది. ప్రాధమికంగా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.ఇక ఈ నేపధ్యంలో ఈ రోజు భేటీలో వారు పలు అంశాలపై ఫైనల్ నిర్ణయం తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ళ తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం వుంది. రాష్ట్రాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది. అంతే కాకుండా నేడు వీరి భేటీ వెనుక పొలిటికల్ అజెండా కూడా ఉన్నట్టు , కేంద్రం ఇరు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర వైఖరిపై కూడా చర్చించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications