ఆర్భాటం ఎందుకు, వీటి మాాటేమిటి: తెరాస సభపై కేసీఆర్కు ప్రశ్న?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారమై దాదాపు మూడేళ్లు కావస్తున్నది. తెలంగాణ సాధనే ధ్యేయంగా సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ నడిబొడ్డుపై పిడికెడు మందితో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2014లో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారమై దాదాపు మూడేళ్లు కావస్తున్నది. తెలంగాణ సాధనే ధ్యేయంగా సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ నడిబొడ్డుపై పిడికెడు మందితో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాస్య శ్రుంఖలాల నుంచి విడివడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల వాస్తవ రూపం దాల్చింది.
అంతే కాదు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు తనదైన శైలిలో రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
మరో నెల రోజుల్లో మూడో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సబ్బండ తెలంగాణ వర్ణాలు ఉత్సాహంగా జరుపుకోబోతున్నాయి. అదే సమయంలో తెలంగాణ గడ్డపై తొలి సర్కార్ కొలువు దీరి మూడేళ్లు పూర్తవుతాయి. మరో ఏడాది గడిస్తే మళ్లీ ప్రజాతీర్పు కోరే సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అంగరంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం పోరుగడ్డ 'ఓరుగల్లు' వేదికగా 'ప్రగతి నివేదన' సభ పేరిట నిర్వహించుకుంటున్నది.

బంగారు తెలంగాణపై సీఎం కేసీఆర్ ఇలా
ఉమ్మడి పాలకుల దాస్య శ్రుంఖలాల నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి కల్పించడంలో కీలక భూమిక పోషించిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని సగర్వంగా ప్రకటించారు. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా సంపూర్ణంగా రూపాంతరం చెంది మిగతా రాజకీయ పార్టీలకు మల్లే వ్యూహ, ప్రతి వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతోంది. మూడేళ్ల సమయంలోనే ఆరు దశాబ్దాల దుష్ప్రభావాలను కడిగేయలేమని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తున్నది.

ఐటికి నిలయం భాగ్యనగరం
ఈ క్రమంలో ఒక్క మాట గుర్తు చేయక తప్పదు. పేరుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయే నాటికి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ దేశంలోనే ఆ మాటకొస్తే అంతర్జాతీయంగానే పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్నది. ఇది ఎవరూ కాదనలేని నిజం కూడా. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్ర బొక్కసానికి ఆయువు పట్టు. గుండెకాయ కూడా.

నీళ్లు, నియామకాల మాటేమిటి?
కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతానికి తరలించుకుపోయినందునే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఆవశ్యకమైంది.
తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత ముందుగా ద్రుష్టిని కేంద్రీకరించాల్సింది జల వనరులను అందుబాటులోకి తెచ్చే అంశంపైనేనన్నది అందరూ అంచనా వేసిన నిష్ఠూర సత్యం. కానీ మూడేళ్ల కాలంలో మిషన్ కాకతీయ పేరిట రాష్ట్రంలో ఉనికిలో ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో నీరు నింపేందుకు జరిగిన చర్యలు అభినందనీయమే. అదే సమయంలో అటువంటి అవకాశాలు లేని ప్రాంతాలకు మెట్ట భూములకు నీళ్లు తరలించేందుకు మంచి సువర్ణావకాశం వచ్చేసింది. కానీ దాన్ని వినియోగించుకునేందుకు తగు రీతిలో స్పందిస్తున్నామా? అంటే లేదనే సమాధానం వస్తున్నది.

టెండర్ల ప్రక్రియ దాటని ఇతర సాగునీటి ప్రాజెక్టులు
నాడు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి రంగారెడ్డి పేరు కలిపి దాదాపుగా పూర్తి కావస్తున్న లిఫ్ట్ పథకాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టవల్సిందే. అదే సమయంలో గోదావరి జలాల వినియోగానికి తీసుకుంటున్న చర్యలు మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గుమ్మం దాటలేదన్న చందంగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మంత్రి హరీశ్ ప్రతీన నెరవేరుతుందా?
ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఉద్యమ నాటి పరిస్థితులు, అంశాలు లేవనెత్తే హక్కు ఉండదన్నదని నిర్వివాదాంశం. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందున విపక్షాలు కూడా పాలకుల పనితీరును అడుగడుగునా ప్రశ్నించడంలో ఔచిత్యం ఉన్నది. ప్రత్యేకించి గోదావరి జలాల తరలింపునకు ‘చేవెళ్ల - ప్రాణహిత' ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం, ఏటిగడ్డ తదితర ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తయిపోతాయని ఊదరగొట్టేస్తున్నారు ఏలినవారు. ఇప్పటికీ అన్ని ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. అయినా వచ్చే ఏడాది ఖరీప్ నాటికి కాళేశ్వరం పూర్తి కావాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రతిన బూనారు.

మూడేళ్లు కావస్తున్న పూర్తిగాని ఉద్యోగుల విభజన
ఇక నియామకాల విషయమే విస్మరిస్తున్నారని నిరుద్యోగులు, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, మేథావులు, రాజకీయ పార్టీలు మండిపడ్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా 1.07 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని స్వయంగా సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించినా ఇప్పటివరకు జరిగిన నియామకాలు కేవలం ఏడెనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే. అయినా ప్రశ్నించిన వారిపై ముప్పేట దాడి చేయడమే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు చెల్లుతున్నది.

రెండేళ్లయినా లక్ష దాటని డబుల్ బెడ్ రూం ఇళ్లు
రాష్ట్ర ప్రగతికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ప్రజల సంక్షేమానికి పథకాలు అమలు చేయాల్సిందే. దానినెవరూ కాదనలేరు. కానీ ఫక్తు పూర్తి రాజకీయ పార్టీ సారథ్యంలోని పాలన తీరుగా ఉండటమే ఇబ్బందికర పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైన అందునా కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఎలా ఉన్నా ఆచరణలో ఎందుకు వెనుకబడుతున్నారన్న సంగతి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు తోడయినా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని.. అవి వివిధ దశల్లో ఉన్నాయని నమ్మ బలుకుతున్నది అధికార టీఆర్ఎస్ నాయకత్వం.

హామీల అమలులో వెనుకంజ ఎందుకు?
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం విషయమై జిల్లాల వారీగా నమూనా కాలనీల నిర్మాణాలు జరిపి మళ్లీ ప్రజాతీర్పు అనుకూలంగా కోరాలని అధికార పార్టీ టీఆర్ఎస్ పరుగులు తీస్తున్నదని విపక్షాలు, విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు చేతి వ్రుత్తులను అందలం ఎక్కిస్తామని చెప్తున్న ప్రభుత్వం గొల్లలు, కుర్మలకు గొర్రెలు, జీవాల పెంపకం ప్రతిపాదన ఇంకా ఆచరణకు నోచుకోనే లేదు. 2014లో దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులు కాగితాలకే పరిమితమన్న విమర్శలు ఉన్నాయి.

కౌలు రైతుల సంగతేమిటో గందరగోళం
తాజాగా పంటల సాగుకు పట్టాదార్ రైతుకు సీజన్ కు రూ.4000 కేటాయిస్తామని తాజా వాగ్దానం. తర్వాత కొంపల్లి సభలో రెండు సీజన్లకు కేటాయిస్తామని ప్రకటన. దానికి ఎంత అవుతుందన్న ఖర్చు ఇతమిద్ధంగా లేదు. కానీ మీడియాలో రకరకాల వాదనలు వచ్చాయి. పట్టా రైతుల సంగతలా ఉంటే కౌలు రైతుల సంగతేమిటో చెప్పనేలేదు మరి. ఏలిన వారిలో ద్రుష్టిలో కౌలు రైతులు ఉన్నారా? అన్నది అనుమానమేనని అంటున్నారు. ఒకవేళ ప్రజాసంక్షేమానికి మెరుగైన పథకాలు అమలు చేస్తూ ఉంటే భారీ స్థాయిలో ప్రజల సమీకరిస్తూ అత్యంత అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపాల్సిన అవసరమేమిటని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పరస్పర విరుద్ధ నిర్ణయాలేల?
200 ఎకరాల విస్తీర్ణంలో జన సమీకరణ.. 16 ఎకరాల పరిధిలో 600 మంది నేతలు ఆశీనులయ్యేందుకు వేదిక నిర్మాణం అవసరమేమిటన్నదీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రగతి నివేదన సభకు భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఏడాది క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో ఏకైక సభ నిర్వహించింది. ప్రచారార్భాటానికి దూరమని ప్రకటించిన టీఆర్ఎస్.. ఈనాడు భారీ ప్రచారార్భాటంతో సభ నిర్వహించాల్సిన అవసరమేమిటన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రభుత్వ దవాఖానాల సంగతేమిటి?
ఈ ప్రగతి నివేదన సభకు హాజరయ్యేందుకు అవసరమైన ఖర్చుల కోసం హైటెక్ తరహాలు సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రముఖ సంస్థల్లో కూలీ చేసి మరీ లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. దీనికి తోడు రెండు, మూడు రోజుల ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ప్రజలను సమీకరించడంలో ఔచిత్యమేమిటని సాధారణ ప్రజాతంత్ర వాదులు సందేహిస్తున్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నా ఏలిన వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇన్ని సమస్యల మధ్య భారీ బందోబస్తు మధ్య ప్రజలతో బహిరంగ సభ నిర్వహించి ప్రజల మద్దతు తమకే ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పాలన్న సంకల్పం ఉంటే మాత్రమే సరిపోదని సూచిస్తున్నారు. ప్రజాభ్యుదాయానికి సరైన రీతిలో జనరంజకంగా పాలన సాగించి ప్రజాతీర్పు పొందితే సర్వత్రా ప్రయోజనమని సూచిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications