మోహన్ బాబు మరో ట్విస్ట్- సుప్రీంకోర్టులో పిటిషన్..!
హైదరాబాద్ లో కుటుంబ వివాదాల నేపథ్యంలో న్యూస్ కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై అతని లోగో మైక్ తీసుకుని దాడి చేసి గాయపర్చిన వ్యవహారంలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేస్తుున్న రాచకొండ పోలీసులు ఆయన్ను అరెస్టు చేయకుండా ఊరటనిస్తున్నారు. అదే సమయంలో మోహన్ బాబు కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు అరెస్టు మాత్రం చేయడం లేదు. తొలుత అరెస్టు భయంతో అజ్ఢాతంలోకి వెళ్లిపోయిన మోహన్ బాబు ఆ తర్వాత తాను ఎక్కడికీ వెళ్లలేదని ఇంట్లోనే ఉన్నానని ప్రకటన చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఈ కేసులో ఎందుకు అరెస్టు చేయడం లేదనే చర్చ మరింత పెరిగింది. అదే సమయంలో బాధితుడు రంజిత్ ను మోహన్ బాబు సహా కుటుంబ సభ్యులు పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అతని వైద్య ఖర్చులతో పాటు ఇతరత్రా ఆర్ధిక సాయం చేసేందుకూ హామీలు ఇచ్చి వచ్చారు.

ఇంత జరిగినా మోహన్ బాబును అరెస్టు భయం వీడటం లేదు. దీంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా కొట్టేసింది. డిసెంబర్ 23న ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ తర్వాత అయినా పోలీసులు మోహన్ బాబును అరెస్టు చేస్తారని భావించినా వారు స్పందించలేదు. కానీ మోహన్ బాబును మాత్రం భయం వీడటం లేదు.
దీంతో ఇప్పుడు మోహన్ బాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తన ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టేసి తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీనిపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications