టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నవదీప్ను 9గంటలపాటు ప్రశ్నించిన ఈడీ, బ్యాంక్ లావాదేవీలపైనే..
హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం సినీనటుడు నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటలపాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
నవదీప్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్తో సంబంధాలు, తదితర విషయాల గురించి ఆరా తీశారు. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని ఈడీ అధికారులు నవదీప్ను ఆదేశించినట్లు సమాచారం. నవదీప్ తోపాటు ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్ పైనా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి కేసులో గత గురువారం ప్రముఖ సినీ నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. దాదాపు ఆరుగంటల పాటు వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంక్ ఖాతాల అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన ఖాతాకు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్ క్లబ్ గురించిన ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
కాగా, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న మహమ్మద్ జిషాన్ అలీఖాన్ అలియాస్ జాక్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. జిషాన్ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు. జిషాన్తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. ఎఫ్ ప్రొడక్షన్కు జిషాన్ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు. సోషల్ మీడియా, యాప్ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిందితులు ఎక్సైజ్ శాఖకు తెలిపారు.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ. ఇక, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు విచారణ సాగింది. అయితే, ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్ స్నేహితుడు జిషాన్ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీల చుట్టే.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీత్సింగ్, నటులు నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారించింది.