నిప్పులకొలిమిలా మారిన తెలుగురాష్ట్రాలకు చల్లని కబురు ..
హైదరాబాద్ : రోహిణి కార్తె ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. శని, ఆదివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. అసలే మాడు పగిలే ఎండలు .. ఉక్కపోతతో విసిగిపోతున్న జనాలకు ఊరట కలిగే విషయమిది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోయారు. జగిత్యాల జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవడంతో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పలు సూచనలు కూడా చేశారు.
చిరుజల్లులు ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శని, ఆదివారల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష ప్రభావంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. అయితే మూడురోజుల్లో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని .. కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే వడగాలులతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. ఎండకాలం చివరి అంకానికి చేరిన తరుణంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. అసలే రోహిణి కార్తే సమయం కావడంతో వేడిమి ఎక్కువైందని .. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి, వడగాలులు ఉంటున్నాయని తెలిపారు. మరో ఐదారు రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్లబడే అవకాశం ఉందని వివరించారు.

మోస్తరు వానలు
దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం ఉపరితల ద్రోని బలహీనంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత మరో మూడురోజులు కాస్త ఎండల ప్రభావం ఉంటుందని వివరించారు. తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగానే పడతాయని ఇప్పటికే వాతావరణ నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా ఎక్కవుగా రికార్డయ్యాయి. 48 డిగ్రీల ఎండలతో జనం అల్లాడిపోయారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట్ల జనాలు ఎక్కువగానే చనిపోయారు. ఎండల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినా .. ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications