భూ ఆక్రమణలకు పాల్పడింది ఒక్క ఈటలే కాదు.!మొత్తం 11మంది మంత్రులు.!కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్.!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఈటల రాజేందర్ భూ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన మీద అత్యంత వేగవంతమైన చర్యలు తీసుకున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. ఎప్పుడైతే ఈటల మీద చర్యలు తీసుకున్నారో అప్పటినుండి భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రుల పరిస్థితి ఏంటని, వారిమీద కూడా విచారణ జరిపించాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఏ మంత్రి ఎన్ని ఎకరాల భూములను కొల్లగొట్టారో వివరించారు. ఇందుకు సంబంధించి ఎఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సంచలనంగా మారారు.
కాంగ్రెస్ పార్టీ సంచలనం.. టీఆర్ఎస్ మంత్రివర్గంలో 11మందిపై అవినీతి ఆరోపణలు..
తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు తారా స్థాయికి చేరుకున్నాయని ఎఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఘాటు విమర్శలు చేసారు. ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం ఎం చేసిందో అందరకి తెలుసని, ప్రస్తుతం అదే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా దళితుల, దేవుడి మాన్యాలని ఆక్రమించుకున్నారని సంచలన ఆరోపణలు చేసారు సంపత్. ఏడు సంవత్సరాలు ఈటల రాజేందర్ సీఎం చంద్రశేఖర్ రావుకు కుడి భుజంగా వ్యవహరించారని గుర్తు చేసారు. ఇదే మంత్రి వర్గంలో ఉన్న మరికొంత మంది మంత్రులపై వచ్చిన ఆరోపణలను ఆయన నిరూపించే ప్రయత్నం చేసారు. అందుకోసం ఆయన పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరాలను బహిర్గతం చేసారు.
ఈటల పై వేగవంతమైన విచారణకు ఆదేశించిన సీఎం.. మిగతా మంత్రుపై కూడా చర్యలు తీసుకోవాలంటున్న కాంగ్రెస్..
గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు అనే టైటిల్ తో ఇందిరా భవన్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రసంటేషన్ ఉత్కంఠను రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది మంత్రులపైన సంపత్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఇందుకు సంబందించిన ఆధార పత్రాలను కూడా ఆయన సేకరించి తెలంగాణ ప్రజానికం కోసం బహిర్గతం చేస్తున్నట్టు స్పష్టం చేసారు. ఈటల మీద ఇరవై నాలుగు గంటల్లో చర్యలకు ఆదేశించిన సీఎం చంద్రశేఖర్ రావు వీరి మీద కూడా చర్యలకు ఉపక్రమించగలరా అని సంపత్ సవాల్ విసిరారు.
భూ ఆక్రమణ దారులపై గవర్నర్ ఫిర్యాదు.. అంతం కాదిది ఆరంభం అంటున్న కాంగ్రెస్..
ప్రభుత్వంలోని పెద్దలకు సీఎం ఆదేశాలతో ఆర్దికంగా సహాయం చేస్తున్నందుకు మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సంపత్ ఆరోపించారు. పార్టీ మారినందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కూడా నజరానా కట్టబెట్టారని మండిపడ్డారు. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోట్ల రూపాయల భూముల్ని ఆక్రమించుకున్నా, 200 ఎకరాల్లో పామ్ హౌస్ కట్టుకొని విలాసవంతంగా వ్యవహరిస్తున్నా సీఎం ఏనాడూ ప్రశ్నించలేదని సంపత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. క్యాబినెట్ లోని మొత్తం పదకొండు మంది మంత్రుల పైన సంపత్ కుమార్ పవర్ పాయంట్ ప్రసెంటేషన్ ఇచ్చారు.
Recommended Video
సిట్టింగ్ జడ్జ్ తో గానీ, సిబిఐ తో గానీ నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలి.. డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..
ప్రస్తుత మంత్రి వర్గంలోని మంత్రులు వారు పాల్పడిన భూ ఆక్రమణల గురించి ఆధారలతో పాటు పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ఇచ్చారు సంపత్ కుమార్. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ ఆలీ, వి.శ్రీనివాస గౌడ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీద వచ్చిన వేలకోట్ల విలువ చేసే భూములు మీద సీఎం చంద్రశేఖర్ రావు పారదర్శక విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేసారు. క్యబినెట్ లో ఈటల రాజేందర్ తో కలిపి మొత్వం 12మంది మంత్రుల మీద వెలుగు చూస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అన్ని వివరాలతో గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసారు.