రామప్ప ఆలయానికి రెండురోజుల పాటు సందర్శకుల నిలిపివేత.. కారణం ఇదే!!
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాన్ని, భద్రాచలం సీతారామ స్వామి ఆలయాలలో పర్యటించనున్న నేపథ్యంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులంతా రామప్ప ఆలయం వద్దకు చేరుకొని ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈనెల 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయ సందర్శన నేపథ్యంలో తాజాగా సందర్శకులకు అనుమతులు నిలిపివేస్తూ ఉత్తర్వులను సైతం జారీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట లోని యునెస్కో గుర్తింపు పొందిన అద్భుత రామప్ప దేవాలయాన్ని ద్రౌపదీ ముర్ము సందర్శించనున్నారు. రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ఆమె ప్రారంభించనున్నారు.
తీర్ధయాత్రల పునరుజ్జీవం ఆధ్యాత్మిక వారసత్వ అభివృద్ధి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ద్రౌపది ముర్ము వరంగల్ లోని రామప్ప దేవాలయం తో పాటుగా, డిసెంబర్ 28వ తేదీన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రామప్ప ఆలయానికి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీలలో సందర్శకులకు అనుమతి నిలిపివేస్తున్నామని కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులు రెండు రోజుల పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు తెలుగు రాష్ట్రాల లోనూ పర్యటించనున్నారు. ఈనెల 26వ తేదీన రాష్ట్రపతి శ్రీశైలం మహా క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకొని, అనంతరం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించనున్నారు. 26వ తేదీన హెలికాఫ్టర్లో బయలుదేరి మధ్యాహ్నం శ్రీశైలం కి చేరుకొని అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటారు ద్రౌపది ముర్ము. అనంతరం తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.
తెలంగాణాపై చంద్రబాబు మాస్టర్ మైండ్; బీఆర్ఎస్ మంత్రులు, అగ్రనేతల ఉలికిపాటు అందుకే!!