కేసీఆర్ -పీకే మంతనాలపై రేవంత్ : అదే జరిగేది- ఇద్దరం కలిసి ప్రకటిస్తాం : రాహుల్ సైతం ...!!
తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ మంతనాలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. ఒక వైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతోనూ ప్రశాంత్ కిషోర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమైందని ప్రచారం సాగుతోంది. ఇటు టీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ కిషోర్ టీం ఐ ప్యాక్ తమకు రాజకీయంగా సేవలు అందిస్తుందని..ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోనే కేసీఆర్ కార్యాచరణ పైన చర్చించారని చెప్పుకొస్తున్నారు.

సీఎం కేసీఆర్ - పీకే వరుస సమావేశాలతో
అటు వైపు బీజేపీ నేతలు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయంటూ ప్రచారం ప్రారంభించారు. ఇక, ఈ మొత్తం వ్యవహారం పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ తో తెగతెంపుల కోసమే కేసీఆర్ను పీకే కలిశారని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రశాంత్కిషోర్కు, తెరాసకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్మీట్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు.

పీకే కాంగ్రెస్ కోసమేనని ధీమాగా
పీకే కాంగ్రెస్లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరాక రాష్ట్రానికి వస్తారన్నారు. తనతో కలిసి ప్రశాంత్ కిషోర్ మీడియా సమావేశం పెడతారని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ స్వయంగా టీఆర్ఎస్ ను ఓడించాలని చెబుతారని వివరించారు. ఇక, పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో కాంగ్రెస్ కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదనే అంశాన్ని తేల్చి చెప్పారని రేవంత్ స్పష్టం చేసారు. మే 6 న బహిరంగ సభ లోనూ రాహుల్ ఇదే విషయాన్ని వెల్లడిస్తారని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరాక ఆయనకు అధిష్ఠానం మాటే ఫైనల్ అని రేవంత్ వివరించారు.

కాంగ్రెస్ వ్యూహాల కోసం సునీల్
మరో వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. తమతో కలిసి సునీల్ పార్టీ వ్యూహాల కోసం పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక, ఢిల్లీ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికల పైన కాంగ్రెస్ నేతలు అధ్యయనం చేస్తున్నారు. అధినేత్రి సోనియా నిర్ణయం మేరకు ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిక.. పార్టీలో స్థానం పైన క్లారిటీ రానుంది. అయితే, అప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో పీకే - కేసీఆర్ మంతనాల పైన ఎవరి అంచనాలతో వారు స్పందించటం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications