కోకాపేట్ భూముల అమ్మకం... అసలు బాగోతం ఇదీ... రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు...
కోకాపేట్ భూముల అమ్మకంలో రూ.1000 కోట్లు నష్టం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తన బంధువులు,బినామీలు,తనతో సంబంధాలు ఉన్నవారికే భూములను విక్రయించారని ఆరోపించారు. గతంలో ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడు పోయిన చోట కేవలం రూ.40 కోట్లకు ఎకరా చొప్పున విక్రయించారని ఆరోపించారు.దేశ,విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని ప్రభుత్వం చెప్పిందని... కానీ వాస్తవం మరోలా ఉందని అన్నారు. వేరే కంపెనీలేవీ టెండర్లలో పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Recommended Video
అప్పట్లో కేటీఆర్,హరీశ్ హంగామా.. ఇప్పుడేమో ఇలా...
'కోకాపేట్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.2వేల కోట్లు వచ్చిందని కేసీఆర్ చెప్పారు. వచ్చిన డబ్బును దళితులు,గిరిజనులు,బీసీల అభివృద్ది కోసం ఉపయోగిస్తామన్నారు. ఇప్పుడు అమ్మిన భూముల పక్కనే 2005,06లో ఎకరా 14.50కోట్లకు ఎకరం పోయింది. దాంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆకాశాన్నంటుతోంది అని అప్పట్లో పత్రికలు రాశాయి. ఆరోజు అమ్మగా మిగిలిన భూములను ఈ నెల 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం వేలం వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఈ భూములను విక్రయించే ప్రయత్నం జరగ్గా... ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట హరీశ్ రావు,కేటీఆర్ నానా హంగామా చేశారు. అధికారంలోకి వచ్చాక విధానాన్నే మార్చుకున్నారు.' రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు : రేవంత్
'కోకాపేట్ భూములను అమ్మకానికి పెట్టడం కంటే ముందు దేశ,విదేశాలకు చెందిన కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని చెప్పారు. తద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు,లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. తీరా చూస్తే ఆ భూముల టెండర్లు దక్కించుకున్నది కేసీఆర్ బినామీలే. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్ని ప్రధాన కంపెనీలకు ఫోన్లు చేసి టెండర్లు వేయవద్దని బెదిరించాడు. ఒకవేళ అక్కడ భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని చెప్పాడు. గండిపేటకు సమీపంలో ఉన్నందునా జీవో.111 ప్రకారం అనుమతులు సాధ్యం కావని వారితో చెప్పాడు. అలా టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా చేశారు...' అని రేవంత్ ఆరోపించారు.
ఎవరెవరికి విక్రయించారు... ఎంత చెల్లించారు...
కోకాపేటలో భూములు కొనుగోలు చేసిన కంపెనీల్లో మై హోం రామేశ్వరరావు,సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డిలకు చెందిన కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే ప్రిస్టేజ్,శ్రీచైతన్య సంస్థలు కూడా భూములు కొనుగోలు చేశాయన్నారు. రామేశ్వరరావుకు చెందిన కంపెనీలు 17.30 ఎకరాలు కొనుగోలు చేయగా.. రూ.1060 కోట్లకు గాను రూ.663కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారని అన్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన కంపెనీలు తొమ్మిదన్నర ఎకరాలు కొనుగోలు చేయగా... రూ.500 కోట్లకు గాను రూ.400 కోట్ల పైచిలుకు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. మన్నె సత్యనారాయణ రెడ్డికి చెందిన కంపెనీ ఏడెకరాలు కొనుగోలు చేయగా... రూ.463 కోట్లకు గాను రూ.325 కోట్లు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. అలాగే ప్రిస్టేజ్,శ్రీచైతన్య కంపెనీలు కూడా మొత్తం విలువను చెల్లించలేదని ఆరోపించారు. ఆ విధంగా ఆ కంపెనీలకు ప్రభుత్వం లబ్ది చేకూరేలా చేసిందన్నారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి స్విజ్ ఛాలెంజ్ విధానంలో మళ్లీ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.