ఘోర ప్రమాదం: మూసీ కాలువలో పడిన ట్రాక్టర్, 15 మంది మృతి
నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది వరకు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో పడింది. ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఈ వ్యవసాయ కూలీలు ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
చనిపోయిన వారిలో 14 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వేములకొండ చెరువు పక్కన పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వ్యవసాయ కూలీలు ట్రాక్టరులో బయలుదేరారు. చెరువు కట్టపై ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా ఓ బైక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిని తప్పించబోవడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి మూసీ కాలువలోకి పడింది.
దీంతో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. విషయం తెలియగానే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసి సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.