ట్రైనీ కానిస్టేబుళ్ళ ఆత్మహత్య: ఒకే రకమైన బట్టలు, వీడని బంధం
హైదరాబాద్: పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో నవీన అనే ట్రైనీ మహిళా కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.అంతకు ముందు రోజే నవీన స్నేహితురాలు ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మాధవి తన స్వగ్రామం మిర్యాలగూడలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితురాలు ఆత్మహత్యను తట్టుకోలేదక నవీన కూడ చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీస్ అకాడమీలో నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నవీన స్వస్థలం నల్గొండ పట్టణం. ఆమె చిన్నప్పటి నుండి మిర్యాలగూడకు చెందిన మాదవీ స్నేహితులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని నవీన స్నేహితురాలు మాధవి మిర్యాలగూడలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో మనస్థాపానికి గురైన నవీన పోలీస్ అకాడమీలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2016లో పోలీస్ శాఖకు ఎంపికైన నవీన ప్రస్తుతం నార్సింగిలోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
నవీన, మాధవిలు ప్రాణస్నేహితులని, ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించేవారని, ఎప్పుడు ఒకేలా ఉండేవారని నవీన తండ్రి నర్సింహ్మ చెప్పాడు. మాధవి ఆత్మహత్యతో మనస్తాపం చెందే నవీన ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దసరా పండుగకు ఇంటికి వచ్చిన నవీన తమతో చాలా సంతోషంగా గడిపిన నవీన ఇకలేదంటూ రోదించాడు.