కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ; నైట్ కర్ఫ్యూ, కఠిన ఆంక్షలపై డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వే లో లక్షలాది సంఖ్యలో జ్వర బాధితులు, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆరోగ్య సిబ్బంది గుర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు చేపట్టిన ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఏం చేస్తుంది? రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటీషన్ఈ పై జరుగుతున్న విచారణలో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డి. శ్రీనివాస్ రావు హైకోర్టుకు తెలంగాణలో కరోనా పరిస్థితిపై నివేదిక సమర్పించారు.

పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నేపథ్యంలో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించేంతగా కరోనా తీవ్రత లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రతతో కరోనా కేసులు లేవని ప్రజారోగ్య శాఖ పేర్కొంది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని వెల్లడించింది . రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డి హెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం పాజిటివిటీ రేటు
రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం మించి లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షల అమలులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా జనాలు గుమిగూడకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. జిహెచ్ఎంసి లో 4.26 శాతం, మేడ్చెల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉంది అని నివేదికలో పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం పాజిటివిటీ రేటు ఉండగా కొత్తగూడెంలో అత్యల్పంగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని పేర్కొన్నారు .

రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 6.1 శాతం
ఇక రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రమాదకరమైన పరిస్థితులు లేవు కాబట్టి నైట్ కర్ఫ్యూ అవసరం ఉండదని డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్నదని మూడు రోజుల్లోనే 1. 78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు.

తప్పుడు గణాంకాలు అని కోర్టుకు తెలిపిన పిటీషనర్ తరపు న్యాయవాదులు
ఇదిలా ఉంటే ప్రభుత్వం తప్పుడు గణాంకాలను సమర్పిస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ కిట్ల లో చిన్నారులకు సంబంధించి చికిత్సకు అవసరమైన మందులు లేవని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే ఫీవర్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని ఇది రాష్ట్రంలో కరోనా తీవ్రతకు నిదర్శనమని చెప్పారు. దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని కోర్టుకు వెల్లడించారు.
Recommended Video

తదుపరి విచారణకు హెల్త్ డైరెక్టర్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశం
ఇక వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం మాస్కులు, సామాజిక దూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణ కొరకు హెల్త్ డైరెక్టర్ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications