సీట్లపై తేల్చేసిన కేంద్రం: కెసిఆర్కూ ఫిరాయింపుల చిక్కులు...
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరిట స్థానాల పెంపు అసాధ్యమేనని కేంద్రం తేల్చేసింది.
హైదరాబాద్: రాజ్యాంగంలోని 170వ అధికరణానికి సవరణ చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరిట స్థానాల పెంపు అసాధ్యమేనని కేంద్రం తేల్చేసింది. అయితే రాజ్యాంగ సవరణకు అనుకూలమా? కాదా? అన్న సంగతి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
దీంతో ఇప్పటివరకు తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని గంపెడాశలు పెట్టుకున్న అధికార టీఆర్ఎస్ అధినాయకత్వంతోపాటు ఇతర నేతలు నిరాశకు గురయ్యారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలియడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గల 119 అసెంబ్లీ స్థానాలు.. పునర్విభజన జరిగితే ఈ సంఖ్య 153కు పెరుగుతుంది.
అదనంగా ఒక్కో లోక్సభ స్థానానికి రెండు చొప్పున 34 అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉన్నది. పలువురు నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని తాజా పరిణామాలు చెప్తున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి, పాత నాయకులకు మధ్య సీట్ల సర్దుబాటు చేసి, సయోధ్య కుదర్చడం కెసిఆర్కు తలకు మించిన భారమే అవుతుందని అంటున్నారు.
ఇలా స్థానాల పెంపు ఆశలు గల్లంతు
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు ప్రధాని నరేంద్రమోదీ కూడా అసెంబ్లీ స్థానాలు పెంచడం సాధ్యపడదని తేల్చేయడంతో ఆశలు అడియాసలయ్యాయి. 119 స్థానాల్లో కొన్నింటిలో మినహా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాజీలు, ఓటమి పాలైన అభ్యర్థులు, ఫిరాయించిన ఎమ్మెల్యేలు టిక్కెట్ల కోసం పెట్టుకున్న కలలు కల్లలుగానే మిగిలాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు లభించడం కష్ట సాధ్యమేనని పరిణామాలు చెప్తున్నాయి.
Recommended Video
కష్టపడ్డ వారికే టిక్కెట్లు
ఇక పనితీరు ఆధారంగానే టిక్కెట్లు కేటాయించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకోసం సీఎం కే చంద్రశేఖర్ రావు తరుచుగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నారు. కొందరి పనితీరు మెరుగు పడింది. మూడు నెలలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉంటూ పనులు చేపడుతున్నారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన ఉండబోదని కేంద్రం కుండబద్ధలు కొట్టడంతో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న వారికి ప్రత్యేకించి ఫిరాయింపుదారులకు టిక్కెట్ లభిస్తుందో? లేదోనన్న భయం పట్టుకున్నది.
ఆశావాహులకు హుళ్లక్కే
మూడేళ్ల కింద జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని వారు, పోటీ చేసి ఓడిపోయిన వారు.. అసెంబ్లీ సీట్ల పెంపు కచ్చితంగా ఉంటుందని, ఈసారి తమకు అవకాశం దక్కుతుందని భావించారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచినవారు గులాబీ కండువా కప్పుకున్నారు. అలా వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన వారు ఏకంగా 27 మంది దాకా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు, ఇటు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జుల (ఓడిపోయిన వారు)కు మధ్య పొసగడం లేదు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా వేర్వేరు వర్గాలు ఉన్నాయి. ఇక విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట పార్టీ తరఫున ఓడిపోయిన వారే కాకుండా, అదే స్థాయిలో ఉన్న ఇతర నాయకులూ ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉన్న 119 స్థానాల్లో ఇంత మందిని సర్దుబాటు చేయడం గులాబీ అధినాయకత్వానికి కష్టంగా మారనున్నది.
ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఇలా కారెక్కారు
అత్యధికంగా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపులు జరిగిందీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే కావడం గమనార్హం. 14 నియోజకవర్గాల పరిధిలో కేవలం నాలుగు చోట్ల మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. మిగతా స్థానాల్లో టీడీపీ ఏడు దాని మిత్రపక్షం బీజేపీ ఒక స్థానం, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నది. అందులో తెలుగుదేశం పార్టీ వారే ఆరుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిలో ఒకరు కారెక్కేశారు. తద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్ఎస్ బలం 11 స్థానాలకు చేరుకున్నది. మల్కాజిగిరి నుంచి లోక్ సభ స్థానానికి ఎన్నికైన సీహెచ్ మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ పక్షాన చేరిపోయారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామన్న హామీపైనే గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా కేంద్రం నిర్ణయం వారిని కలవర పెడుతున్నది.
ప్రకాశ్ గౌడ్ పై శాసనమండలి చైర్మన్ ఇలా
చేవెళ్ల నుంచి గెలుపొందిన యాదయ్య టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం స్తబ్దుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో స్థానంలో టిక్కెట్ ఇస్తామని ఆశలు కల్పించింది కానీ పరిస్థితి తిరగబడటంతో మళ్లీ ఎవరికి టిక్కెట్ లభిస్తుందోనని ఆందోళన మొదలైంది. ఇక మహేశ్వరం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన తీగల క్రుష్ణారెడ్డి తర్వాత ఏంచక్కా కారెక్కేశారు. కానీ పార్టీలో సీనియర్లు కొత్తా మనోహర్ రెడ్డి, పాండు రంగారెడ్డి టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి గెలుపొందిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారెక్కినా.. అప్పటికే సీనియర్ నేత చంద్రశేఖర్ రెడ్డి సహా మరికొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎటూ గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్వర్ణలత ‘సెగ' ప్రకాశ్ గౌడ్ కు ఉండనే ఉన్నది.
తాండూరు, మల్కాజిగిరిల్లోనూ నేతల మధ్య పోటీ
శేరిలింగంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే. ఈ స్థానం నుంచి గతంలో ఓడిపోయిన శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారెక్కిన బండి రమేశ్ తదితరులు టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ స్థానానికి ఎన్నికైన వివేక్ కు పోటీగా హన్మంతరెడ్డి, కేఎం ప్రతాప్ నుంచి ఒత్తిడి ఉన్నది. కూకట్ పల్లి స్థానం నుంచి గెలుపొందిన మాధవరం క్రుష్ణారావుపై పోటీకి గతంలో ఓటమి పాలైన గొట్టిముక్కల పద్మారావు, నర్సింహా యాదవ్ తదితరులు పోటీకి సిద్దం అవుతున్నారు. ఇక టీఆర్ఎస్ గెలుపొందిన తాండూరు, వికారాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలకు పోటీగా సీనియర్ నేతలు టిక్కెట్ కోసం కాచ్చుకూర్చున్నారు.
మిర్యాలగూడలోనూ ఎమ్మెల్యే వర్సెస్ నేతలు
దేవరకొండలో మొదట జెడ్పీ చైర్మన్ను (కాంగ్రెస్) టీఆర్ఎస్లోకి తీసుకురాగా, తర్వాత అక్కడి ఎమ్మెల్యే (సీపీఐ) గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఉండనే ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు కుర్చీలాట జరుగుతోంది. టీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసిన మందుల సామేలుకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఇక్కడ గ్యాదరి కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ ఇప్పటికీ ఈ ఇద్దరు నాయకుల మధ్య పోటీ ఉంది. ఇక మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది తర్వాత కారెక్కారు. కానీ అక్కడి టీఆర్ఎస్ నేతల్లో పలువురి టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు.
డోర్నకల్ రెడ్యానాయక్కు ప్రత్యామ్నాయం ఏది?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, ఆశ్వరావుపేట, తదితర నియోజకవర్గాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి గెలుపొందిన మదన్ లాల్ లకు ప్రత్యర్థులుగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఇల్లందు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కనకయ్యకు పోటీగా టీఆర్ఎస్ నేతల్లో పోటీకి కొదవలేదు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా పరిధిలోని డోర్నకల్ నుంచి ఎన్నికైన డీఎస్ రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పేసి కారెక్కారు. అక్కడ కూడా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేత కూడా పోటీ పడుతున్నారు. ఇక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు పొందిన కొందరు ఎమ్మెల్యే టికెట్పై ఆశతో ఉన్నారు. నల్లగొండలో బండా నరేందర్రెడ్డి, పెద్దపల్లిలో ఈద శంకర్రెడ్డి, నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి వంటి వారు ఈ వరసలో ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో మరిన్ని కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే యోచనలో గులాబీ అధినాయకత్వం ఉంది. ఎమ్మెల్సీ భానుప్రసాద్ వంటి వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అద్రుష్ఠాన్ని పరీక్షించుకోవాలని ఆశిస్తున్నారు.