మంత్రి పద్మారావు గ్రేటర్ ప్రచారంలో విషాదం: తెరాస కార్యకర్త మృతి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రచార పర్వంలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి పద్మారావు ప్రచార పర్యటనలో అపశ్రుతి దొర్లింది. సికింద్రాబాదులోని మెట్టుగుడా అభ్యర్థి భార్గవికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
తొక్కిసలాటలో రవి అనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త మరణించాడు. ఆయన మృతదేహాన్ని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవి వయస్సు 42 ఏళ్లు. మెట్టుగుడా డివిజన్ టిడిపి కార్యాలయానికి ఎదురుగా ఈ సంఘటన జరిగింది.
టిఆర్ఎస్పై నాగం ధ్వజం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అలవికాని హామీలతో ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
మెదక్ జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని 111వ డివిజన్ భారతీనగర్లో టీడీపీ-బీజేపీ అభ్యర్థి గోదావరికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హాయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అంటూ మళ్లీ హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని కోరారు.