కేసీఆర్ బొమ్మ దగ్ధం, టీడీపీ నేతపై టీఆర్ఎఎస్ దాడి
హైదరాబాద్/అమరావతి: తమ పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను ఎలా దగ్ధం చేస్తారని మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం తెరాస నాయకులు సోమవారం టీడీపీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి పైన దాడి చేశారు. దుర్భాషాలాడారు.
అతని పైన దాడి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. తనపై దాడి చేశారని కృష్ణారెడ్డి ప్రతి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు వీడియో టేప్ ల పైన ఏపీ భగ్గుమంది. తెలంగాణలోను పలుచోట్ల కేసీఆర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
పరిపాలనా పరంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో కేసీఆర్, జగన్ కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ టీడీపీ నేతలు, పలువు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కేసీఆర్, జగన్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి. కేసీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి, టీ న్యూస్ చానళ్ల పైన కూడా ఫిర్యాదు చేశారు.
చిత్తూరు పట్టణంలో, కర్నూలు జిల్లా డోన్ పీఎస్లో, విశాఖలో త్రీటౌన్ పీఎస్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, రాజమండ్రి, నర్సాపురం పోలీస్స్టేషన్, భీమవరం వన్టౌన్లో, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో, కాకినాడ టూటౌన్, చిత్తూరు జిల్లా అలిపిరి, పీఎస్లో, విజయవాడ, గవర్నర్పేట, భవానీపురం, తోట్లవల్లూరు పీఎస్ల్లో, విజయనగరం జిల్లాలోని పట్టణ వన్టౌన్ పీఎస్లో, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, అనంతపురం జిల్లాలోని పట్టణ వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదులు అందాయి. ఇందులో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.