ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద విజయారెడ్డి సహా ధర్నా (ఫొటోలు)
హైదరాబాద్: నోటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యకర్తల మధ్య సమరంగా మారుతోంది. మంగళవారంనాడు ఇరు పార్టీలో కార్యకర్తలు పోటాపోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి.
తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావు, ఏపి సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలతో హైదరాబాదులోని బంజారాహిల్స్లోని ఎన్టిఆర్ ట్రస్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం కెసిఆర్ దిష్టిబొమ్మను మహిళా నాయకులు దగ్ధం చేశారు.
తెలుగు మహిళా నాయకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విషయాన్ని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి కార్యకర్తలతో కలిసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకున్నారు.
కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు
టిఆర్ఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు చెరుకుని ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తెలుగు మహిళా నాయకులు అక్కడికి చేరుకొని కెసిఆర్కు, టిఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా..
టిఆర్ఎస్ కార్యకర్తలు టిడిపి మహిళా నేతలకు ప్రతిగా స్పందిస్తూ నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.
చెప్పులు విసిరారు...
టిడిపికు చెందిన మహిళలు టిఆర్ఎస్ కార్యకర్తలతో తీవ్ర వాగ్వాదానికి దిగి వారిపై చెప్పులు విసిరారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేస్తున్న సమయంలో తెలుగు మహిళలు రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు.
లోనికి చొరబడేందుకు..
టిఆర్ఎస్ నాయకులు ట్రస్ట్భ్వన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేసి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.