టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే: రెడ్లపై కేసీఆర్ ఫోకస్: రేవంత్ రెడ్డికి చెక్
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. తన వ్యూహాలను మార్చుకున్నట్టే కనిపిస్తోంది. సరికొత్తగా సామాజిక వర్గ సమీకరణాలకు తెర తీసినట్టే అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సామాజిక వర్గ సమీకరణాలపై దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లకు ఏకకాలంలో చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కేసీఆర్ ఆలోచనలకు ప్రతిబింబంగా..
కొత్తగా పెద్దల సభకు పంపించడానికి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా.. కేసీఆర్ ఆలోచనలను ప్రతిబింబించినట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కోటా కింద శాసన మండలికి పంపించడానికి ఉద్దేశించిన ఈ జాబితాలో ఆరుమందికి చోటు దక్కింది. ఈ ఆరుమందిలో ముగ్గురు.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలమైన ఓటుబ్యాంకుగా ఉంటూ వస్తోన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి వేసిన వ్యూహంగా దీన్ని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అభ్యర్థులు వీరే..
ఎమ్మెల్యేల కోటా కింద శాసన మండలి కోసం గులాబీ బాస్ కేసీఆర్ ఎంపిక చేసిన ఈ జాబితాలో సగం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తన అఖిల భారత సర్వీసుకు రాజీనామా చేసిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలకు ఈ జాబితాలో చోటు లభించింది. మిగిలిన ముగ్గురిలో మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్, బండ ప్రకాష్ ఉన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ, బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు.
ఇవ్వాళ నామినేషన్లు..
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి అవసరమైన నామినేషన్ల దాఖలుకు ఇవ్వాళే చివరి రోజు. దీనితో అభ్యర్థుల జాబితాలను టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఖరారు చేసింది. వారందరూ ఇప్పటికే ప్రగతి భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను అందుకోనున్నారు. ఆ వెంటనే నామినేషన్లను దాఖలు చేస్తారు. రిటర్నింగ్ అధికారికి వాటిని అందజేస్తారు. ఈ మధ్యాహ్నానికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
వెంకట్రామిరెడ్డికి బంపర్ ఆఫర్..
సిద్ధిపేట్ జిల్లా మాజీ కలెక్టర్ పీ వెంకట్రామి రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే. తన అఖిల భారత సర్వీసులకు రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయనకు పెద్దల సభకు ఎంపికయ్యారు. 2007 బ్యాచ్ ప్రమోటీ ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. ఇదివరకు సిద్ధిపేట్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో కలెక్టర్ హోదాలో ఆయన కేసీఆర్ కాళ్లు మొక్కారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక..
ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గంపై దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి కారణం- రాజకీయంగా ఆయన ఎదుర్కొంటోన్న రెండు అంశాలు. ఒకటి- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రెండు- కొత్తగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన వైఎస్ షర్మిల. ఈ రెండు ఫ్యాక్టర్లను దృష్టిలో ఉంచుకుని.. బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న రెడ్లను పార్టీ వైపునకు ఆకర్షితులు చేయడం కేసీఆర్ ముందున్న తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు.
ఈటెల స్థానంలో బండ ప్రకాష్..
ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో్ బండ ప్రకాష్కు చోటు కల్పించినట్టు కనిపిస్తోంది. ఈటల.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరడం, అదే హుజూరాబాద్ నుంచి గెలుపొందడం వంటి పరిణామాలు- టీఆర్ఎస్కు అండగా ఉంటూ వస్తోన్న ముదిరాజ్ సామాజిక వర్గం ఓటుబ్యాంకును బలహీన పర్చిందనే అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణాలయ్యాయి. ఈ లోటును భర్తీ చేసుకోవడంలో భాగంగా అదే సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ను పెద్దల సభకు పంపించడానికి దారి తీసిందనే వాదనలు లేకపోలేదు.