దొంగల పార్టీ: అలీ, హరీష్ను రానివ్వం, అంత ఖర్మ పట్టలేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఓ దొంగల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ బుధవారం నాడు ధ్వజమెత్తారు. త్వరలో జరిగే శాసన మండలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో టిఆర్ఎస్ విపక్షాలను ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు.
ఖమ్మం జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, సమర్థవంతంగా తిప్పి కొట్టిన ఎంపీటీసీ సభ్యులిని అభినందిస్తున్నానని చెప్పారు. మిగతా జెడ్పీటీసీ, ఎంపీటీసులు కూడా అధికార పార్టీ ప్రలోభాలకు లొంగవద్దన్నారు.
కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు కూడా లొంగరని చెప్పారు. పంటలు వేయవద్దని కలెక్టర్లే రైతులకు చెప్పడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కాస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
క్యాంప్ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఖమ్మం జిల్లాలో కరవు మండలాలు ప్రకటించక పోవడం దారుణమన్నారు. అది రైతులను అవమానించడమేనని చెప్పారు. రాష్ట్రంలో పాలన ప్రయివేట్ లిమిటెడ్గా మారిందని ఎద్దేవా చేశారు.
హరీష్ రావును అడుగు పెట్టనివ్వం: జగ్గారెడ్డి
మెదక్ జిల్లాకు సింగూరు నీరు ఇవ్వకుంటే మంత్రి హరీష్ రావును తాము జిల్లాలో అడుగు పెట్టనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు.
జిల్లాకు సింగూరు నీరు జలాలను ఇస్తామన్న మంత్రి హరీష్ రావు ఎందుకు మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీతో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు పట్టలేదన్నారు. మెదక్ జిల్లాలో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.