రాజీనామా ప్రకటించిన ఎంపీ కే కేశవరావు - రాజ్యసభ ఛైర్మన్కు లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన నిర్ణయాన్ని ఇదివరకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్కు తెలియజేసినట్లు వివరించారు.
తన రాజీనామా వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు గానీ.. మరే ఇతర అంశాలు గానీ లేవని కే కేశవరావు చెప్పారు. హఠాత్తుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని వదులుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఏకపక్ష విధానాలు నచ్చకపోవడం వల్లే ఆయన తన సభ్యత్వానికి గుడ్బై చెప్పారని సమాచారం. ఈ కౌన్సిల్ అందజేసే ఎలాంటి ప్రతిపాదనలు గానీ, చేసే సిఫారసులను గానీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అభిప్రాయంలో కేకే ఉన్నట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్గా ఉన్నారు. 1966లో ఇది ఏర్పాటైంది. చట్టబద్ధమైన అధికారాలు దీనికి ఉన్నాయి. స్వతంత్రంగా పని చేసే సంస్థ. మీడియా స్వీయ నియంత్రణను పర్యవేక్షించడంతో పాటు పెయిడ్ ఆర్టికల్స్ను అరికట్టడం.. దీన్ని నివారించడానికి తగిన ప్రతిపాదనలు, సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం ఈ కౌన్సిల్ ప్రధాన విధి.
ఇందులో 20 మంది వరకు సభ్యులు ఉంటారు. ఇందులో అయిదు చొప్పున రాజ్యసభ, లోక్సభ సభ్యులు నామినేట్ అవుతారు. గత ఏడాది ఏప్రిల్లో అప్పటి రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు కేశవరావు ఈ సభ్యత్వానికి నామినేట్ చేశారు. ఆయనతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నామినేట్ అయ్యారు. తాజాగా ఈ పదవి నుంచి కేశవరావు తప్పుకొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందనే కారణంతోనే కేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.