టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా?: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్!
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి ప్రముఖ నాయకులు బీజేపీలో చేరగా.. తాజాగా మరో సీనియర్ నేత కూడా అధికార పార్టీ నుంచి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలంతా ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్నారు.
కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైనట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీల్లో ఢిల్లీలో భిక్షమయ్యగౌడ్.. బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు.. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆలేరులో టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఆయన.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు. టీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేకపోవడం.. నామినేటెడ్ పోస్టులు ఆశించినా.. నిరాశే ఎదురుకావడంతో.. ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరగగా.. వచ్చేవారం బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications