సంగారెడ్డిలో టీఆర్ఎస్ నేత దారుణ హత్య.. వేర్వేరు మండలాల్లో తల, మొండెం..
సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వారం రోజుల కిందట మిస్సింగ్ అయిన నేత హత్యకు గురైనట్లు తేలింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలమల తండాకు చెందిన కడావత్ రాజును గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు . అతని తల, మొండెం వేరుగా చేసి వివిధ మండలాల పరిధిలో పారవేయడం సంచలనంగా మారింది. రాజు తల రాయికోడ్ మండలం కుసునూర్ వాగులో లభ్యం కాగా.. మొండెం మనూర్ మండలంలోని పుల్కుర్తి బ్రిడ్జిపై సింగూర్ బ్యాక్ వాటర్ లో లభించింది.
తల, మొండెం వేరు చేసి..
తెల్లాపూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఎస్టీసెల్ అధ్యక్షుడుగా కడావత్ రాజు పనిచేస్తున్నారు. అయితే రాజు కన్పించడం లేదని ఈనెల 24న కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు .. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంద్రకరణ్ పోలీస్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు రాజును అత్యంత దారుణంగా హత్య చేసి.. తల , మొండెం వేరు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులుకు సమాచారం అందింది.
పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
దీంతో పటాన్చెరు డీఎస్పీ భీమ్రెడ్డి బీడీఎల్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కడావత్ రాజు తల, మొండెంను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కొరకు జహీరాబాద్కు తరలించారు. బీడీఎల్ పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గురైన రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు హత్యతో వెలమల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భూ వివాదాలే హత్యకు కారణమా?
కాగా, కడావత్ రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి. భూ లావాదేవీల విషయంలో కొంత మంది బిల్డర్లతో పాటు స్థానికులతో వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజు హత్యకు గురై ఉంటాడని తండా వాసులు పేర్కొంటున్నారు. అటు తండాకు చెందిన వారే రాజును హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఘటనపై బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజు తండ్రి కూడా హత్యకు గురయ్యారు.