భగ్గుమన్న ఫ్యాక్షన్ రాజకీయం..? టీఆర్ఎస్ నేత దారుణ హత్య..
సహకర సంఘ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత ఒకరిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా... ఆయన్ను వెంబడించిన ప్రత్యర్థులు.. చివరకు వేట కొడవళ్లు,కత్తులతో హత్య చేసి పరారయ్యారు. అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత హత్యతో స్థానిక నేతలు ఉలిక్కిపడ్డారు. హత్య గురించి తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వెంకన్న హత్య..
సూర్యాపేట జిల్లాలోని యర్కారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సహకర సంఘం ఎన్నికల కోసం శుక్రవారం ప్రచారం నిర్వహించారు.ఇదే క్రమంలో దాదాపు 20 మంది కాంగ్రెస్ వర్గీయులు మారణాయుధాలతో వెంకన్నను వెంబడించారు. ఈ క్రమంలో వెంకన్న వీరయ్య అనే ఇంట్లో దాక్కున్నాడు. ఆ విషయం గుర్తించిన ప్రత్యర్థులు ఇంట్లోకి చొరబడి వేట కొడవళ్లు,కత్తులతో నరికి,బండరాయితో మోది హత్య చేశారు.

రెండు రోజుల క్రితం ఘర్షణ
సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓటర్లందరితో సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ వర్గీయులు.. అక్కడికి వెళ్లి టీఆర్ఎస్ నాయకులతో గొడవకు దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్గీయులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్న ఆరోపణలున్నాయి.

కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నేతలు..
దాడి తర్వాత టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ వర్గీయులు కక్ష పెంచుకున్నారు. అదను కోసం వేచి చూసి శుక్రవారం రాత్రి వెంకన్నను వెంబడించి హత్యకు పాల్పడ్డారు. హత్య సమయంలో కాంగ్రెస్ నేత సైదులుకు సైతం గాయమైంది. ఆయన రిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. హత్య నేపథ్యంలో యార్కారం గ్రామంలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా,పదిహేనేళ్ల క్రితం ఇదే గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

సహకార సంఘం ఎన్నికలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఒంటిగంట తర్వాత గంట భోజన విరామం ఇస్తారు. అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు మొదలవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటించనున్నారు. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.












Click it and Unblock the Notifications